
- బైక్లు, బోలెరో ట్రాలీల్లో యథేచ్ఛగా తరలింపు
- వాహనాల నంబర్ ప్లేట్లను ట్యాపరింగ్ చేస్తున్న అక్రమార్కులు
మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జిల్లాలోని బయ్యారం, గార్ల, గూడురు అటవీ ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు టేకు దుంగలను బైక్లు, బొలెరో ట్రాలీ, ఎడ్లబండ్లపై యథేచ్ఛగా తరలిస్తున్నారు. కొత్తగూడ, గంగారం అటవీ ప్రాంతాల నుంచి తరలిస్తున్న కొన్ని దుంగలను ఆఫీసర్లు పట్టుకుంటున్నా, అక్రమార్కులు మాత్రం తమ దందా ఆపడం లేదు.
ముందు ఎస్కార్ట్... వెనుక కలప వెహికల్స్
అక్రమార్కులు కలప రవాణాకు పకడ్బందీ ప్లాన్ను అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ముందు ఎస్కార్ట్ వాహనాలను పంపించి రూట్ మొత్తం క్లియర్గా ఉందని సిగ్నల్ వచ్చిన తర్వాతే కలప లోడ్ వెహికల్స్ ముందుకు నడిపిస్తున్నారు. దట్టమైన అడవిలోంచి బైక్పైలను దుంగలను సమీప గ్రామాల్లోని కట్టె కోత మిల్లుల వద్దకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ట్రాలీ వాహనాల్లో నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్
కలప అక్రమ రవాణా చేసే వ్యక్తులు వెహికల్ నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడుతున్నారు. టీఎస్ 26టీఏ 0748 నంబర్ గల బొలెరో ట్రాలీని రెండు నెలల క్రితం ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. అదే నంబర్తో ఉన్న మరో వెహికల్ సోమవారం ఆఫీసర్లకు పట్టుబడింది. దీంతో కలప అక్రమ రవాణాతో పాటు ఆర్టీఏ రూల్స్ బ్రేక్ చేసినందున ఆయ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.
ఇటీవల పట్టుబడిన కలప
- మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ అటవీ ప్రాంతంలో జూన్ 5న బొలెరో ట్రాలీ వాహనంలో తరలిస్తున్న రూ.1.50 లక్షల విలువైన కలపను పోలారం వద్ద పట్టుకున్నారు.
- ఈ నెల 5న మొండ్రాయిగూడెం వద్ద రూ.లక్ష విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.
- సోమవారం ఎర్రారం వద్ద బొలెరోలో తరలిస్తున్న రూ. లక్ష విలువైన కలపను ఫారెస్ట్ ఆఫీసర్లు సీజ్ చేశారు.
నిఘా పెంచాం
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో నిఘా పెంచాం. వాచ్ టవర్స్ ఏర్పాటు చేశాం. ఎక్స్ఎల్ బైక్లపై దుంగలను తరలిస్తున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నాం.
- చంద్రశేఖర్, గూడూరు, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్