
హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణకు ఈరోజు(మార్చి 22), రేపు (మార్చి 23) వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
పగలంతా ఎండ దంచికొట్టగా, సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. అల్వాల్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, బండ్లగూడ జాగిర్, మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గట్టి వర్షం పడింది. శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ ఈరోజు(మార్చి 22) 7 జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజుతో పాటు వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలకు తగ్గు ముఖం పడతాయని, మళ్లీ మూడు రోజుల తర్వాత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో శుక్రవారం పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.