న్యూఢిల్లీ : గోధుమ ధరను, అక్రమ నిల్వలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం సోమవారం స్టాక్ హోల్డింగ్ పరిమితులను విధించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మార్చి 31, 2025 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. సింగిల్ రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు, టోకు వ్యాపారులు ప్రతి శుక్రవారం గోధుమ నిల్వలను వెల్లడించాలి. రిటైల్ ఔట్లెట్లు, దుకాణాలు 10 టన్నుల వరకు గోధుమలను నిల్వ చేసుకోవచ్చు.
వ్యాపారులు, టోకు వ్యాపారులు, రిటైలర్ల పెద్ద డిపోలు 3,000 టన్నుల చొప్పున నిల్వ చేసుకోవచ్చు. అన్ని సంస్థలు తమ స్టాక్ పొజిషన్ను ఆహార ప్రజాపంపిణీ శాఖ పోర్టల్ ద్వారా వెల్లడించాలి. పరిమితులను మించి స్టాక్లను కలిగి ఉన్నవారు కొత్త నిబంధనలను పాటించేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే గోధుమలు, గోధుమ పిండి ధరలు కిలోకు రూ.2 వరకు పెరిగాయి.