
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నదని, ప్రతి చిన్న పనికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, ఆబ్కారీ వంటి శాఖల్లో అవినీతి అడ్డూఅదుపు లేకుండా ఉందన్నారు.
తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఉద్యోగులకు కావాల్సిన చోట పోస్టింగులు, ప్రమోషన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఏసీబీ, అవినీతి కేసుల్లో దొరుకుతున్న ఉద్యోగులకు పోస్టింగ్, ప్రమోషన్లు ఇవ్వొద్దని లేఖలో పేర్కొన్నారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేకుండా పోయిందన్నారు.