
- నేడు వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం జగన్
- 77 వేల మందికి రూ.38 కోట్లు పంపిణీ
లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లు, మౌజమ్ లను ఆదుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. మంగళవారం అమరావతిలోని క్యాంపు ఆఫీసులో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. దాదాపు 77 వేల మందికి రూ.38 కోట్ల సాయం అందనుంది. వీరిలో 34 వేల మంది అర్చకులు, 30 వేల మంది పాస్టర్లు, 14 వేల మంది ఇమామ్, మౌజమ్లు ఉన్నారు.
తమ సర్కారు ఏడాది పాలనపై ‘మన పాలన మీ సూచన’ మేధోమథన సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. షాపు ఉన్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు జూన్ 10న రూ.10 వేలు చొప్పున అందిస్తామన్నారు. జులై 8న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా 28 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తామని చెప్పారు.
లాయర్ల కార్పస్ నిధికే రూ.100 కోట్లు
లాయర్ల వెల్ఫేర్ కోసం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్ నిధికే అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ ఫండ్స్ నిర్వహణ బాధ్యతను లాయర్లకే అప్పగించాలని అధికారులకు సూచించారు. ‘లా నేస్తం’ పేరిట ఇప్పటికే లాయర్లను ఆదుకుంటున్నామని, ఇప్పుడు బదిలీ చేసిన ఫండ్స్ ద్వారా వారికి మరింత ప్రయోజనం చేకూరుతుందని జగన్ చెప్పారు.