
వనపర్తి, వెలుగు : గ్యాస్ ఏజెన్సీ కోసం అప్లై చేసుకున్న ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 15.89 లక్షలు వసూలు చేసి చివరకు మోసం చేశారు. వివరాల్లోకి వెళ్తే... వనపర్తికి చెందిన కోన్యాల ప్రదీప్చారి గ్యాస్ ఏజెన్సీ కోసం ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నాడు. తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రదీప్చారికి ఫోన్ చేసి గ్యాస్ ఏజెన్సీ కేటాయించేందుకు ప్రాసెసింగ్ ఫీజు, ఎన్వోసీ లైసెన్స్, ప్రీబుకింగ్ కోసం డబ్బులు పే చేయాలని చెప్పాడు.
దీంతో అతడు చెప్పిన అకౌంట్కు ప్రదీప్చారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా మొత్తం రూ.15.89 లక్షలను గుర్తు తెలియని వ్యక్తి వసూలు చేశాడు. తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి శుక్రవారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.