- గైడ్లైన్స్ రాకముందే అలా ఎలా చెప్తారన్న జడ్పీ చైర్మన్
- వాగ్వాదానికి దిగిన జడ్పీటీసీలు
- మైక్ విసిరికొట్టిన జడ్పీటీసీ నగేశ్
- యాదాద్రి సమావేశంలో గొడవ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జడ్పీ మీటింగ్లో గొర్రెల పంపిణీ స్కీంపై గొడవ జరిగింది. ఈ విషయంలో జడ్పీ చైర్మన్ఎలిమినేటి సందీప్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్తో చౌటుప్పల్, ఆలేరు జడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్రెడ్డి, డాక్టర్ కుడుదుల నగేశ్వాగ్వాదానికి దిగారు. మంగళవారం యాదాద్రి జడ్పీ మీటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పశు సంవర్ధక శాఖపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా చౌటుప్పల్జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్రెడ్డి గొర్రెల స్కీం గురించి లేవనెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేస్తామంటూ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. డబ్బులు వేసిన తర్వాత అకౌంట్లు ఫ్రీజ్చేశారా? ఇప్పుడు గొర్రెలు ఇస్తారా? లేక నగదు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు.
దీంతో పశుసంవర్ధక శాఖ ఆఫీసర్ కృష్ణ మాట్లాడుతూ గొర్రెల కాపరుల అకౌంట్లు ఫ్రీజ్చేసిన తర్వాతే నగదు జమ చేశామని, ఇప్పుడు గొర్రెలే ఇస్తామన్నారు. దీంతో జడ్పీ చైర్మన్ జోక్యం చేసుకొని గైడ్లైన్స్ రాకుండానే గొర్రెలు పంపిణీ చేస్తామని ఎలా చెబుతారంటూ ఆఫీసర్ను ప్రశ్నించారు. జడ్పీటీసీలు కల్పించుకొని గైడ్లైన్స్ రాకుండానే నగదు బదిలీ చేస్తామని చెప్పి, గొర్రెల కాపరుల అకౌంట్లను ఫ్రీజ్చేసి డబ్బులు ఎలా వేశారంటూ నిలదీశారు. గొర్రెల పంపిణీ స్కీంలో నగదు బదిలీ డిమాండ్వచ్చినందున మునుగోడును పైలట్ప్రాజెక్ట్గా ఎంపిక చేసి గొర్రెల కాపరుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు వేసిందని జడ్పీ చైర్మన్ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే వారి అకౌంట్లను ఫ్రీజ్చేశారన్నారు. దీనిపై జడ్పీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ జోక్యం చేసుకొని ఏ ప్రభుత్వమున్నా..రూపొందించిన పాలసీల ప్రకారమే ఆఫీసర్లు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతో జడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ 'మనం ఉత్తర తెలంగాణలో లేము.
దక్షిణ తెలంగాణలో ఉన్నందునే వివక్ష చూపుతున్నారు' అని కామెంట్ చేశారు. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ అందరం ఉత్తర భారత్లో లేమని, దక్షిణ తెలంగాణలో ఉన్నామని, ఐటీలు, ఈడీలు ఎక్కడకు పోతున్నాయన్నారు. వివక్ష గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి ఉంటుందన్నారు. దీంతో పలువురు జడ్పీటీసీలు పైకి లేవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గొర్రెల స్కీంపై ఆలేరు జడ్పీటీసీ నగేశ్ మరోసారి ప్రశ్నిస్తూ గొర్రెలే ఇస్తారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించడంతో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి ‘గైడ్లైన్స్ రాలేదు’ అని సమాధానమిచ్చారు. ‘సమాధానం చెప్పాల్సింది ఆఫీసర్ మీరు కాదు’ అంటూ నగేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేవలం ఫొటోలకు పోజులివ్వడానికి.. మీడియాలో రావడానికే మీటింగ్లో పోటీపడి మాట్లాడుతున్నారని జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి కామెంట్ చేయడంతో నగేశ్ వాగ్వాదానికి దిగారు. మైక్ కట్ చేయాలని సందీప్రెడ్డి ఆదేశించడంతో..అసహనానికి గురైన నగేశ్ చేతిలోని మైక్ విసిరికొట్టి కూర్చున్నారు. దీంతో మైక్విసిరి కొట్టడం మంచిది కాదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కామెంట్ చేశారు.
ఇంకా డిసైడ్ చేసుకోలే
పింఛన్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి తెలిపారు. పింఛన్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు మించి భూమి ఉన్నవారి పేర్ల తొలగింపు విషయంలో వెలుసుబాటు కల్పించే అవకాశం లేదన్నారు. దళితబంధు స్కీమ్లో చాలామంది ఫోర్ వీలర్ తీసుకుంటున్నారని, అయితే ఫోర్ వీలర్స్ వాడేవారిలో ఎక్కువగా ఉపాధి కోసమే తీసుకుంటున్నందున ఈ విషయంలో ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్నదన్నారు.