
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 2023 జనవరి 12వ తేదీ వరకు జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆదివారం హైదరాబాద్లో మినిస్టర్లు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ఆవిష్కరించారు. ఈవో శివాజీ ఆధ్వర్యంలో వైదిక కమిటీ టీం ముందుగా భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల పాదాల వద్ద ఇన్విటేషన్లు, వాల్పోస్టర్లు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిని తీసుకుని హైదరాబాద్వెళ్లారు. ముందుగా ఎండోమెంట్ మినిస్టర్అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తర్వాత రవాణా శాఖ మినిస్టర్ పువ్వాడ అజయ్కుమార్ను వేర్వేరుగా వారి వారి నివాసాలలో కలిశారు. వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి శేషమాలికలు, ప్రసాదం, జ్ఞాపికలను అందించారు. తర్వాత వారితో ఇన్విటేషన్లు, వాల్పోస్టర్లు ఆవిష్కరింపజేశారు. ముక్కోటి ఉత్సవాలకు వారిని వైదిక కమిటీ ఆహ్వానించింది.
ముగిసిన శ్రీరామ పునర్వసు దీక్షలు
కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రారంభమైన శ్రీరామ పునర్వసు దీక్షలు ఆదివారంతో ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన శ్రీరామదీక్షాపరుల రామనామ స్మరణలతో క్షేత్రం మారుమోగింది. భద్రుని మండపంలో శ్రీరామదీక్షపరులు పునర్వసు దీక్షలను విరమించారు.