ఇ న్నాళ్లూ ఎడాపెడా ఇన్కమ్ ట్యాక్స్లతో మిగులుబాటు లేక తిప్పలు పడ్తున్న వేతనజీవికి.. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. రూ. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన పనిలేదని బడ్జెట్లో ప్రకటించింది. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపింది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను తీసుకొస్తున్నట్లు చెప్పింది. క్యాన్సర్ మందులకు పన్నులు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐదేండ్లలో 75వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫుడ్ డెలివరీ వంటి ఆన్లైన్ సేవలు అందించే గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమాను ప్రకటించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 50లక్షల 65వేల 345 కోట్ల బడ్జెట్ను శనివారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ రాసిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే కవితతో స్పీచ్ మొదలుపెట్టిన ఆమె.. ‘వికసిత్ భారత్’ కోసం ఈ బడ్జెట్ను తీసుకొస్తున్నామని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి ప్రజలు మూలస్తంభమని, వారిని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లూ రూ. 7 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ పరిమితిని రూ. 12 లక్షలకు పెంచుతున్నామని.. దీని వల్ల రూ. 80 వేల వరకు మిగులుబాటు అవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్లో బిహార్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి మఖానా బోర్డు ఏర్పాటుతోపాటు కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉద్యోగ నియామకాల మాటేమైందని... పప్పులు, నూనెలు, ఇంటిసామాన్ల ధరల భారంతో గోసపడ్తున్న సామాన్యులను కేంద్రం ఏం ఆదుకుంటున్నదని నిలదీశాయి.
ట్యాక్స్ ఎలా, ఎంత పడుతుందంటే?
ఉదాహరణ1:
రమేశ్ అనే ఉద్యోగికి ఏడాదికి రూ.12 లక్షల 75 వేల ఆదాయం వచ్చిందని అనుకుందాం. ఆయనకు ఇతర ఆదాయాలు ఏమీ లేవు. అందువల్ల రమేశ్ మొత్తం ఆదాయం రూ.12.75 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు తీసేస్తే రూ.12 లక్షలపై ట్యాక్స్ పడుతుంది. ఇందులో రూ. 4 లక్షల వరకు బేసిక్ ట్యాక్స్ మినహాయింపు దక్కుతుంది. అంటే రూ.8 లక్షల ఆదాయంపై ట్యాక్స్ లెక్కిస్తారు. కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం.. మొదటి రూ. నాలుగు లక్షలపై రూ.4 లక్షల నుంచి 8 లక్షల ట్యాక్స్ లోని 5 శాతం పన్ను పడుతుంది. అంటే రూ.20 వేలు. ఆదాయంలోని మిగిలిన రూ.4 లక్షలపై ‘రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల ట్యాక్స్’ 10 శాతం పడుతుంది. అంటే రూ.40వేలు. మొత్తంగా రూ.60వేలు ట్యాక్స్ పడుతుంది. ప్రభుత్వం రూ.12 లక్షల ఆదాయం వరకు గరిష్టంగా రూ. 60 వేల ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నది కాబట్టి ట్యాక్స్ పేయర్ చెల్లించే పన్ను జీరో అన్నమాట. కొత్త ట్యాక్స్ సిస్టమ్లోని ప్రస్తుత రేట్ల ప్రకారం అయితే రమేశ్ రూ.83వేలు ట్యాక్స్ కట్టాలి. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల వల్ల ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉదాహరణ 2:
రమేశ్ అనే ఉద్యోగికి ఆదాయం ఏడాదికి రూ.12 లక్షల 75 వేలకు పైగా ఉంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దానిలో కూడా మార్జినల్ కన్సెషన్ ఉంటుంది. రమేశ్ ఆదాయం రూ.12 లక్షల 80 వేలు అని అనుకుందాం. ఇందులో నుంచి రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే రూ.12,05,000 పైన ట్యాక్స్ లెక్కిస్తారు. ఇందులో రూ.4 లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉంటుంది. రూ.8.05 లక్షలపై ట్యాక్స్ పడుతుంది. మొదటి రూ.4 లక్షలపై ‘రూ.4 లక్షల నుంచి 8 లక్షల ట్యాక్స్’ స్లాబ్లోని 5 శాతం పన్ను పడుతుంది. అంటే రూ.20 వేలు. మిగిలిన రూ.4.05 లక్షల ఆదాయంపై ‘రూ.8 లక్షల నుంచి 12 లక్షల ట్యాక్స్’ స్లాబ్లోని 10 శాతం పన్ను పడుతుంది. పన్ను రూ.40,000. మిగిలిన రూ.5 వేల ఆదాయంపై ‘రూ. 12 లక్షల నుంచి 16 లక్షలు ట్యాక్స్’ స్లాబ్లోని 15 శాతం ట్యాక్స్ పడుతుంది. అంటే రూ.750. మొత్తం ట్యాక్స్ రూ.60,750. కానీ, ట్యాక్స్ రిబేట్ లిమిట్ (రూ.12 లక్షలు)కంటే కేవలం రూ.5 వేలు మాత్రమే ఎక్కువ (ట్యాక్స్ పడే ఆదాయం కంటే) ఉండడంతో మార్జినల్ కన్సెషన్ కింద రూ.5 వేలనే ఇన్కమ్ ట్యాక్స్గా పరిగణిస్తారు. అంటే మొత్తం ట్యాక్స్ ఈ రూ.5 వేలే. దీనికి హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ కూడా కలుపుకుంటే మొత్తం ట్యాక్స్ రూ.5,400 అవుతుంది. ఇక.. వ్యక్తి ఆదాయం (స్టాండర్డ్ డిడక్షన్కు ముందు) రూ.13,45,000 వరకు మార్జినల్ కన్సెషన్ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
TAX ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 1 తర్వాత ఫైల్ చేసే ఐటీ రిటర్న్లకు మాత్రం గతంలోని పన్ను స్లాబ్లే వర్తిస్తాయి. తాజాగా మారిన పన్ను స్లాబ్లు మాత్రం 2025–26 ఆర్థిక సంవత్సరానికి వాడుకోవచ్చు. అంటే రానున్న ఆర్థిక సంవత్సరం కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ఫైల్ చేసే ఐటీఆర్లకు తాజాగా మారిన ట్యాక్స్ రేట్లు వర్తిస్తాయి.
పాత పన్ను విధానంలో మార్పుల్లేవ్
పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. యథాతథంగా ఉంచింది. ఈ విధానంలో రూ.2.5 లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉంది. రూ.5 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ రిబేట్ పొందొచ్చు. 80సీ, 80 డీ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు పొందొచ్చు.