IND vs ENG: తోక ముడిచిన ఇంగ్లాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్

IND vs ENG: తోక ముడిచిన  ఇంగ్లాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్

టీ20 సిరీస్‌లో ఏకైన విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు.. వన్డేల్లో ఆ గెలుపునూ అందుకోలేకపోయింది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో తేడాతో చేజిక్కించుకుంది. తద్వారా 14 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేసింది. మొత్తం మీద వన్డేల్లో ఇంగ్లాండ్‌పై ఇది నాలుగోది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత రోహిత్ సేన 356 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఇంగ్లీష్ బ్యాటర్లు 214 పరుగులకే చాపచుట్టేశారు. ఎప్పటిలానే బజ్‌బాల్ వీరులు కాసేపు మెరుపులు మెరిపించి ఆ తరువాత తోక ముడిచారు. ఇంగ్లండ్ బ్యాటర్లు మొదటి 20 ఓవర్లు ధీటుగా బదులిచ్చినా.. ఆ తరువాత పెవిలియన్‌కు క్యూ కట్టారు. మంచి ఆరంభాలు లభించినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 

ALSO READ | IND vs ENG: స్కూల్ క్రికెట్ అనుకున్నావా.. ఎందుకు DRS..?: కన్నెర్ర చేసిన గవాస్కర్

ఫిల్ సాల్ట్(23), బెన్ డకెట్(34), టామ్ బాంటన్(38), జో రూట్(24), గస్ అట్కిన్సన్(38) రాణించారు. భారత బౌలర్లు సమిష్టిగా తలా ఓచేయి వేసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అర్ష్‌దీప్ 2, హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

గిల్ సూపర్ సెంచరీ

అంతుకుముందు టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ (112) సెంచరీ చేయగా, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ (52i), యువ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (78) హాఫ్‌ సెంచరీలతో కదం తొక్కారు. చివరలో కేఎల్‌ రాహుల్ (40) సైతం పర్వాలేదనిపించాడు. దాంతో, టీమిండియా సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.