![క్లీన్ స్వీప్పై గురి..నేడు ఇంగ్లండ్తో ఇండియా మూడో వన్డే](https://static.v6velugu.com/uploads/2025/02/indias-final-chance-to-fine-tune-side-before-champions-trophy_Cqv2rLXJSp.jpg)
- కోహ్లీ ఫామ్పైనే ఎక్కువ ఫోకస్
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్,స్పోర్ట్స్ –18లో లైవ్
అహ్మదాబాద్ : చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతుండటంతో టీమిండియా ఇప్పుడు రెండు లక్ష్యాలపై దృష్టి పెట్టింది. ఒకటి.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం, రెండోది.. ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో బుధవారం జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో ఈ రెండు టార్గెట్స్ను పూర్తి చేసేందుకు రెడీ అయ్యింది.
రెండో వన్డేలో రోహిత్ సెంచరీ సాధించడంతో చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలు ఓ కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి విరాట్ కూడా గాడిలో పడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కోహ్లీ పేవల ఫామ్లో లేకపోయినా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోతున్నాడు. ఈ ఒక్క బలహీనతను అధిగమిస్తే అతను గాడిలో పడి జట్టును ముందుకు తీసుకెళ్లగలడు.
బరిలోకి కుల్దీప్
ఇండియా టీమ్లో ప్రధాన మార్పులు లేకపోయినా.. చాంపియన్స్ నేపథ్యంలో బుమ్రాను మూడో వన్డేలో ఆడిస్తారని భావించారు. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం బుమ్రా ఎన్సీఏలోనే ఉన్నాడు. బుమ్రా ప్లేస్లో జట్టులోకి వచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్క వికెట్తోనే సరిపెట్టుకున్నాడు. కాబట్టి అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకోవచ్చు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన పేసర్ మహ్మద్ షమీతో పాటు హర్షిత్ రాణాను కొనసాగించనున్నారు.
ఆల్రౌండర్లు హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్ ప్లేస్లకు ఢోకా లేదు. బ్యాటింగ్లోనూ ఇండియా మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. రెండో వన్డేలో ఆడిన లైనప్ను యధావిధిగా కొనసాగించనుంది. ఒకవేళ భిన్నమైన కాంబినేషన్ను ట్రై చేయాలంటే ఫామ్లో లేని కేఎల్ రాహుల్ ప్లేస్లో పంత్ను దించొచ్చు. యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కానున్నాడు.
పరువు కోసం..
టీ20, వన్డే సిరీస్లను కోల్పోయిన ఇంగ్లండ్ కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. భారీ ఆశలు పెట్టుకున్న కోర్ బ్యాటింగ్ లైనప్ ఫెయిల్ కావడం ఇంగ్లిష్ మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. ఇది ఇలాగే కొనసాగితే చాంపియన్స్లో తిప్పలు తప్పవని భావిస్తోంది. ఓపెనర్లు డకెట్, సాల్ట్తో పాటు బట్లర్ ఆకట్టుకున్నా మిడిలార్డర్ వైఫల్యం టీమ్ను వెంటాడుతోంది. బ్రూక్, లివింగ్స్టోన్ ఫామ్లేమి ఇబ్బందిగా మారింది.
గాయంతో బెతెల్ మ్యాచ్కు దూరం కావడం ప్రతికూలాంశం. బౌలింగ్లో ఆదిల్ రషీద్ మినహా మిగతా వారు ప్రభావం చూపలేకపోతున్నారు. ఆర్చర్, మహ్మూద్, వుడ్ గాడిలో పడాల్సి ఉంది.
జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమీ.
ఇంగ్లండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జో రూట్, హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, సాకీబ్ మహ్మూద్ / జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.