IND vs NZ: బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమి 

IND vs NZ: బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమి 

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఈ ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ ఓటమి నుంచి గట్టెక్కలేకపోయింది. భారత్ నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్లు లథమ్ (0), కాన్వే (17) త్వరగా ఔటైనప్పటికీ.. విల్ యంగ్ (48*), రచిన్ రవీంద్ర (39*) జోడి మరో వికెట్‌ పడనీయకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

తొలి ఓవర్‌లోనే వికెట్

ఆఖరి రోజు ఆట ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే టీమిండియాకు వికెట్ దక్కింది. బుమ్రా ఓ చక్కని బంతితో తొలి ఓవర్‌లోనే కివీస్‌ ఓపెనర్ టామ్‌ లాథమ్‌ను బురిడీ కొట్టించాడు. దాంతో, ఓ అరగంట పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. లక్ష్యం చిన్నది కావడం.. కివీస్ బ్యాటర్లు డిఫెన్స్‌కు ప్రాధాన్యమివ్వడంతో.. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ల వేటలో పైచేయి సాధించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‪లో 46 పరుగులకే కుప్పకూలడం.. బుమ్రా మినహా ఇతర బౌలర్లు రాణించకపోవడం భారత్‌ను దెబ్బతీసింది. 

సంక్షిప్త స్కోర్లు 

  • ఇండియా తొలి ఇన్నింగ్స్: 46/10
  • న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402/10 (రచన్ రవీంద్ర- 134, కాన్వే - 91) 
  • ఇండియా రెండో ఇన్నింగ్స్: 462/10 (సర్ఫరాజ్ ఖాన్- 150, రిషబ్ పంత్- 99)
  • న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 107/2 (విల్ యంగ్- 45 నాటౌట్, రచిన్ రవీంద్ర- 38 నాటౌట్)

ఈ ఇరు జట్ల మధ్య అక్టోబర్ 24 నుంచి పూణె వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.