
- ఫేవరెట్గా బరిలోకి రోహిత్సేన
- మూడో టైటిల్పై గురి
- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్18,
- జియో హాట్స్టార్లో లైవ్
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పని పట్టేశాం.. పొరుగు జట్టు బంగ్లాదేశ్ను కొట్టేశాం.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా అడ్డూ తొలగించాం. ఇప్పుడు మిగిలింది న్యూజిలాండ్ జట్టే. లీగ్ దశలోనే ఓసారి కివీస్ రెక్కలు విరిచేసిన టీమిండియా మరోసారి బ్లాక్క్యాప్స్ టీమ్ మైండ్బ్లాంక్ చేసేస్తే టార్గెట్ పూర్తవుతుంది..! చాంపియన్స్ ట్రోఫీ పుష్కర కాల విరామం తర్వాత మళ్లీ మన సొంతం అవుతుంది. మెగా టోర్నీలో నేడే ఫైనల్..! న్యూజిలాండ్తో టైటిల్ పోరులో ఇండియానే ఫేవరెట్!
అరబ్ గడ్డపై అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్సేన ఆఖరాటలోనూ అదే హవా కొనసాగించాలని.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని మరోసారి ఐసీసీ చాంపియన్ అవ్వాలని ఆశిస్తున్న కోట్లాది మంది అభిమానులు.. విజయోస్తు అని మన జట్టును దీవిస్తున్నారు. మరి టీమిండియా మూడోసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందా?
దుబాయ్: వరుసగా నాలుగు మ్యాచ్లు. అన్నింటిలోనూ ఏకపక్ష విజయాలు. బ్యాటింగ్లో తిరుగులేదు.. బౌలింగ్లో ఎదురులేదు. ఇదే జోరుతో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా పట్టుదలగా బరిలోకి దిగుతోంది. లీగ్ దశ చివరి మ్యాచ్లో బ్లాక్క్యాప్స్ జట్టును ఓడించినప్పటికీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు.
ఆస్ట్రేలియా మాదిరిగా ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ ఎప్పుడూ ఇండియాకు కఠిన ప్రత్యర్థే. ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుతో ముఖాముఖీ మ్యాచ్ల్లో ఆ టీమ్ 10–6తో ఆధిక్యంలో ఉంది. నాకౌట్ రౌండ్లలో ఇరు జట్లూ నాలుగు సార్లు తలపడితే కివీస్ మూడుసార్లు నెగ్గి 3–1తో ముందంజలో నిలిచింది. ఇందులో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి మన టీమ్ను చాలా కాలం వెంటాడింది. దాంతో పాటi2021 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ కివీస్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు రోహిత్సేన ముందుంది.
స్పిన్నర్లే విన్నర్లు
మెగా టోర్నీలో టీమిండియా నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపడం మాస్టర్ స్ట్రోక్ అయింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమ రైట్–లెఫ్ట్ రిస్ట్ స్పిన్తో ప్రత్యర్థులను ఓ ఆటాడుకుంటున్నారు. అదే టైమ్లో స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్తోనూ మ్యాజిక్ చేస్తున్నారు. టోర్నీలో ఇప్పటిదాకా 21 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు ఫైనల్లోనూ అత్యంత కీలకం కానున్నారు. ఇక, న్యూజిలాండ్పైనే డబుల్ సెంచరీతో వన్డేల్లో తన మార్కు చూపెట్టిన ఓపెనర్ శుభ్మన్ గిల్ మెగా ఫైనల్లోనూ ఆ టీమ్పై మెరుగైన పెర్ఫామెన్స్ చేయాలని చూస్తున్నాడు.
ఓపెనర్లు రోహిత్, గిల్ మంచి పునాది వేస్తే మిడిలార్డర్పై ఒత్తిడి తగ్గుతుంది. ఇక, కింగ్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ నిలకడ జట్టును దుర్బేధ్యంగా మార్చింది. అవకాశం వచ్చినప్పుడు అక్షర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకున్నారు. ఆఖరాటలో వీళ్లంతా సమష్టిగా పోరాడితే జట్టుకు తిరుగుండదు. ఈ మ్యాచ్లోనూ ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమే. చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో ఒక్క వికెట్ తీయని పేసర్ షమీ..సెమీస్లో ఆసీస్పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఫామ్ అందుకున్నాడు. ఫైనల్లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీసే బాధ్యతను తీసుకోవాలి.
రోకో ఫ్యూచర్ తేల్చే ఫైనల్!
గతేడాది టీ20 వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ రోహిత్, కోహ్లీ (రోకో) జోడీ మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ టోర్నీకి ముందు ఇద్దరి వన్డే భవితవ్యంపై అనేక ప్రశ్నలు వచ్చాయి. ఫైనల్ మ్యాచ్ ఫలితంతో వాటికి స్పష్టమైన సమాధానం రానుంది. ట్రోఫీ నెగ్గితే రోకో ఇంకొన్నాళ్లు ఈ ఫార్మాట్లో నిశ్చింతగా కొనసాగొచ్చు. అది జరగాలంటే రోహిత్ బ్యాటర్గా టీమ్ను ముందుండి నడిపించాలి. హిట్మ్యాన్ ఆఖరాటలో సూపర్ హిట్ అయి.. కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తే ఇండియా విజయాన్ని కివీస్
అడ్డుకోలేదు.
25 ఏండ్ల నిరీక్షణ ఫలించేనా
బలమైన క్రికెట్ జట్లలో ముందుండే న్యూజిలాండ్ వైట్ బాల్ ఫార్మాట్లో ఇప్పటివరకు ఒకే ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలిచింది. 2000లో ఇదే చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో ఆ టీమ్ ఇండియానే ఓడించడం గమనార్హం. మరో ఐసీసీ టైటిల్ కోసం 25 ఏండ్లుగా నిరీక్షిస్తున్న న్యూజిలాండ్కు ఇప్పుడు మన జట్టే అడ్డుగా ఉంది. లీగ్ దశ చివరి మ్యాచ్లో ఓడినా సెమీస్లో బలమైన సౌతాఫ్రికాకు చెక్ పెట్టిన శాంట్నర్ సేన తుదిపోరుకు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకుంది. స్పిన్ను మెరుగ్గా ఎదుర్కొనే కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర బ్లాక్క్యాప్స్ టీమ్స్ బ్యాటింగ్కు అత్యంత కీలకం కానున్నారు.
సెమీస్లో సెంచరీలు చేసి ఈ ఇద్దరూ జోరు మీద ఉన్నారు. ఆరో ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతున్న కేన్ వన్డేల్లో ఇంకెంత కాలం కొనసాగుతాడో ఈ మ్యాచ్ ఫలితం తేల్చనుంది. అయితే, ఇండియాను ఓడించాలంటే మిగతా బ్యాటర్లు కూడా రాణించాల్సి ఉంటుంది. కివీస్ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. కెప్టెన్ శాంట్నర్, బ్రేస్వెల్కు తోడుగా రచిన్, ఫిలిఫ్స్ తమ స్పిన్ బాల్స్తో బ్యాటర్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. కానీ, భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ప్రధాన పేసర్ మ్యాట్ హెన్రీ ఫైనల్కు దూరమైతే కివీస్కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. తను ఫిట్గా లేకుంటే డఫీ, నేథన్ స్మిత్లో ఒకరు తుది జట్టులోకి వస్తారు.
పిచ్/వాతావరణం
- గ్రూప్ దశలో ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన వికెట్ను ఫైనల్కు ఉపయోగించనున్నారు. ఇది స్లో వికెట్. స్పిన్నర్లకు అనుకూలించొచ్చు. టాస్ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్కు మొగ్గు చూపొచ్చు. 270–280 రన్స్ మంచి స్కోరు అవుతుంది. దుబాయ్లో వేడి పెరిగింది. ఆదివారం వర్ష సూచన లేదు.
- తుది జట్లు (అంచనా)
- ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ (కీపర్), హార్దిక్, అక్షర్ ,జడేజా, కుల్దీప్, షమీ, చక్రవర్తి.
- న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్,
- విలియమ్న్, లాథమ్ (కీపర్), డారిల్ మిచెల్, ఫిలిప్స్, బ్రేస్వెల్, శాంట్నర్ (కెప్టెన్), జెమీసన్, ఒరూర్క్, హెన్రీ/నేథన్ స్మిత్.