IND vs ZIM: కుమ్మేసిన యంగ్ గన్స్.. టీ20 సిరీస్ భారత్ వశం

 IND vs ZIM: కుమ్మేసిన యంగ్ గన్స్.. టీ20 సిరీస్ భారత్ వశం

జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను యంగ్ ఇండియా.. మరో మ్యాచ్ మిగిలివుండగానే చేజిక్కించుకుంది. 3-1 తేడాతో వశం చేసుకుంది. శనివారం(జులై 13) జరిగిన నాలుగో టీ20లో భారత యువ జట్టు.. ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చిత్తుగా ఓడించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఎంతో శ్రమించి 153 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. దానిని భారత యంగ్ గన్స్ ఆడుతూ పాడుతూ చేధించారు. ఓపెనింగ్ జోడి శుభ్‌మన్ గిల్ (58 నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరే మ్యాచ్ ముగించారు. ఛేదనలో ఈ జోడి తడబడ్డ సందర్భమే కనిపించలేదు. వీరిద్దరూ ఆతిథ్య జట్టు బౌలర్లను తునాతునకలు చేస్తూ.. కళ్లు తిరిగే షాట్లతో అలరించారు. 150 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించి.. భారత యువ కెరటాల సత్తా ఏంటో చూపించారు. 

జింబాబ్వే కెప్టెన్ మెరుపులు

అంతకుముందు జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు మధెవర్ (25), మరుమాణి (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికిందర్ రజా (46; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఫలితంగా, ఆతిథ్య జట్టు భారత్ ఎదుట ఛాలెంజింగ్ టార్గెట్ విసరగలిగింది. భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబే వికెట్ చొప్పున సాధించారు.

ఈ ఇరు జట్ల మధ్య జులై 14న ఆదివారం నామమాత్రపు ఐదో టీ20 జరగనుంది.