సంకెళ్లేసి గెంటేసినా మౌనంగానే ఉంటారా..? ప్రధాని మోదీ తీరుపై ఇండియా కూటమి నిరసన

సంకెళ్లేసి గెంటేసినా మౌనంగానే ఉంటారా..? ప్రధాని మోదీ తీరుపై ఇండియా కూటమి నిరసన

న్యూఢిల్లీ: భారతీయులను అమెరికా నుంచి ఇండియాకు తరలించడం పట్ల ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అమెరికా చర్యపై మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మోదీ సర్కార్ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. విశ్వ గురువునని చెప్పుకునే మోదీ భారతీయులను వెనక్కి పంపిస్తుంటే ట్రంప్తో ఎందుకు మాట్లాడలేదంటూ నినాదాలు చేశారు.

అక్కడి నుంచి వచ్చిన వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి ఖైదీల మాదిరిగా భారత్కు తరలించడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు కూడా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఉన్నారు.

అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఫస్ట్ బ్యాచ్‌‌ విమానం భారత్ చేరిన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ ప్లేన్ పంజాబ్ లోని అమృత్‌‌సర్‌‌లో ఉన్న శ్రీ గురు రామ్‌‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. అందులోని 104 మందిలో  పంజాబ్‌‌కు చెందినవారు 30 మంది, హర్యానా, గుజరాత్‌‌కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌‌, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఇద్దరు చండీగఢ్‌‌కు చెందినవారు ఉన్నట్లు అధికార వర్గాలు వివరించాయి. త్వరలో మరింత మంది మైగ్రెంట్స్ ను భారత్ చేర్చే అవకాశం ఉందని తెలిపాయి. 

అక్రమ వలసదారులతో కూడిన ప్లేన్ భారత్ చేరిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు బయట భారీ బారికేడింగ్ తో పాటు పెద్ద సంఖ్యలో  పోలీసు సిబ్బందిని మోహరించారు. 104 మందిని తనిఖీలు చేసిన తర్వాత వారిని ఇండ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. వారిలో ఎవరికైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అక్కడే అదుపులోకి తీసుకునేందుకు కూడా చర్యలు చేపట్టారు.