ట్రంప్‎కు భయపడి కాదు.. టారిఫ్‎ల తగ్గింపుపై భారత్ క్లారిటీ

ట్రంప్‎కు భయపడి కాదు.. టారిఫ్‎ల తగ్గింపుపై భారత్ క్లారిటీ

న్యూఢిల్లీ: తన ఒత్తిడి వల్లే తమ దిగుమతులపై టారిఫ్స్‎ను తగ్గించేందుకు భారత్​అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ చేసిన వ్యాఖ్యలపై భారత అధికార వర్గాలు స్పందించాయి. సుంకాల్లో కోత విధించింది ట్రంప్‎కు భయపడి కాదని, అభివృద్ధి చెందుతున్న దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసమని చెప్పాయి. ఇందులో భాగంగానే టారిఫ్‎లు తగ్గించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నాయి.

గతంలో కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఆస్ట్రేలియా, యూఏఈ, స్విట్జర్లాండ్​, నార్వేలాంటి దేశాలపై భారత్​టారిఫ్‎లను తగ్గించిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం యూరోపియన్​యూనియన్, యూకేతో అగ్రిమెంట్​కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపాయి. ఇదే క్రమంలో అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే టారిఫ్‎లను తగ్గించాలని భారత్ నిర్ణయించిందని, ట్రంప్​విధించిన గడువు సమీపిస్తున్నదనే భయంతో కాదని తేల్చి చెప్పాయి.  

అన్ని ప్రొడక్ట్స్‎పై టారిఫ్ ​ఎత్తివేయాలన్న అమెరికా

అగ్రికల్చర్​ప్రొడక్ట్స్​మినహా అన్ని ఉత్పత్తులపై టారిఫ్‎ను ఎత్తేయాలని భారత్‎ను అమెరికా కోరింది. అమెరికాకు భారత్​అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఫైనాన్షియల్​ఇయర్​లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 118.2 బిలియన్​డాలర్లకు చేరకున్నది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే  లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది.