న్యూఢిల్లీ: ఇండియా రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కారు. ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇంటి ముందు బైఠాయించారు. అల్బేనియాలో ఈ నెల 28 జరిగే వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్స్ నుంచి ఇండియా జట్లను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) విత్డ్రా చేసుకోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను పరిష్కరించి, తమను టోర్నీకి పంపించాలని కోరుతూ ఎంపికైన 12 మంది రెజ్లర్లు మాండవీయ ఇంటి ముందుకెళ్లారు.
విషయం తెలుసుకున్న మంత్రి మాండవీయ రెజ్లర్లతో మాట్లాడి వాళ్లు టోర్నీలో పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్టు హామీ ఇచ్చారు. అండర్23, సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్ కోసం ట్రయల్స్ నిర్వహించి డబ్ల్యూఎఫ్ఐ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని సాక్షి మాలిక్ భర్త , రెజ్లర్ సత్యవర్త్ కడియన్ కోర్టును ఆశ్రయించడంతో ఫెడరేషన్ మూడు జట్లు ఈ మెగా టోర్నీ నుంచి విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అయితే, రెజ్లర్లతో మాట్లాడిన మాండవీయ వాళ్లు అల్బేనియా వెళ్లి టోర్నీలో పాల్గొనేలా చేస్తా మని ప్రకటించడంతో ఇండియా జట్లకు లైన్ క్లియర్ అయింది.