
- డీప్సీక్, చాట్ జీపీటీకి పోటీగా తెస్తాం: అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ:చైనా డీప్సీక్, అమెరికా చాట్ జీపీటీ వంటి జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ను మనదేశమూ తయారు చేస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోపు ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన డీప్సీక్ఉచితంగా, వేగంగా సేవలు అందిస్తూ సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. డీప్సీక్ దెబ్బకు ఎన్విడియా వంటి అమెరికా టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి.
ఒడిశాలో జరిగిన ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ ఈ లార్జ్లాంగ్వేజ్ మోడల్ మన సాంస్కృతిక, భాషాపరమైన అవసరాలకు తగినట్టు తయారు చేస్తున్నామని, ఇందుకోసం ఇండియా ఏఐ కంప్యూట్ ఫెసిలిటీ సహకారం అందిస్తోందని వెల్లడించారు.
దీనికి 18,693 గ్రాఫిక్ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) ఉంటాయని వైష్ణవ్ వెల్లడించారు. కనీసం ఆరు స్టార్టప్లకు ఏఐ మోడల్స్ను తయారు చేస్తే సత్తా ఉందని అన్నారు. ‘‘దీని తయారీకి కామన్ కంప్యూట్ ఫెసిలిటీ చాలా ముఖ్యం. అడ్వాన్స్ ఏఐను డెవెలప్ చేయడానికి రీసెర్చర్లు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు భారీ కంప్యుటేషనల్ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి.
ఇండియా ఏఐ మిషన్లో భాగంగా షేర్డ్కంప్యూటింగ్ వనరులను అందించాలని నిర్ణయించాం. దీనికి 19 వేల జీపీయూలను అమర్చాలని నిర్ణయించాం. ఇందులో 12,896 ఎన్విడియా హెచ్100 జీపీయూలు, 1,480 ఎన్విడియా హెచ్200 జీపీయూలు ఉంటాయి.
ఇవి అత్యంత శక్తిమంతమైన ఏఐ చిప్స్. వీటిలో పది వేల జీపీయూలు ఇప్పటికిప్పుడు వాడకానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటిని దశల వారీగా ఉపయోగంలోకి తీసుకువస్తాం. డీప్సీక్ కోసం కేవలం రెండు వేల జీపీయూలకు శిక్షణ ఇచ్చారు” అని ఆయన వివరించారు.
జీపీయూలకు సబ్సిడీ
అందుబాటు ధరల్లో జీపీయూలను తీసుకురావడానికి రీసెర్చర్లకు, విద్యాసంస్థలకు 40 శాతం సబ్సిడీ ఇస్తామని మంత్రి చెప్పారు. దీనివల్ల ఒక్కో జీపీయూ అవర్కు రూ.100 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు.
ఈ విషయంలో గ్లోబల్ రేటు రూ.240 వరకు ఉందని, కంప్యూటర్ పవర్ యావరేజ్ రేటు ఒక్కో జీపీయూ అవర్కు రూ.115.85 వరకు ఉందని వివరించారు. అమెరికా నుంచి ఇండియాకు చిప్స్ దిగుమతులపై ఆంక్షల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మనదేశం ఏడాదికి 50 వేల దాకా జీపీయూ చిప్స్ను కొనొచ్చని చెప్పారు.
మనపై అన్ని దేశాలకూ గౌరవం ఉంది కాబట్టి ఇండియా ఏఐ మిషన్కు ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు. డేటా భద్రత గురించి స్పందిస్తూ లామా మాదిరే చైనా ఓపెన్సోర్స్ ఏఐ మోడల్ డీప్సీక్ త్వరలోనే ఇండియా సర్వర్ల ద్వారా పనిచేస్తుందని వెల్లడించారు.