న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో ఇండియా షూటర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మెన్స్, విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లలో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచారు. మెన్స్ టీమ్ ఫైనల్లో ఉమేశ్ చౌదరి, ప్రధ్యుమ్న్ సింగ్, ముకేశ్ నేలవల్లితో కూడిన ఇండియా జట్టు మొత్తం 1726 పాయింట్లతో అగ్రస్థానంతో స్వర్ణం సొంతం చేసుకుంది. రొమేనియా 1716 పాయింట్లతో రజతం, ఇటలీ 1707 పాయింట్లతో కాంస్యం గెలిచాయి. విమెన్స్ 10 మీ. ఫైనల్లో కనిష్క దాగర్, లక్షిత, అంజలి చౌదరితో కూడిన జట్టు 1708 పాయింట్లతో బంగారు పతకం ఖాతాలో వేసుకుంది.
కాగా, మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఇండివిడ్యువల్ ఫైనల్ పోటీలకు ఆలస్యంగా వెళ్లిన కారణంగా ఉమేశ్ చౌదరి ఖాతా నుంచి రెండు పాయింట్లు కోత పెట్టారు. దాంతో అతను స్వర్ణం గెలిచే అవకాశం కోల్పోయాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో ఉమేశ్, ప్రధ్యుమ్న్ వరుసగా 580, 578 స్కోర్లతో మూడు, నాలుగో స్థానాలతో ఫైనల్ చేరారు. కానీ, పెనాల్టీ కారణంగా 8 మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో ఉమేశ్ ఆరో ప్లేస్తో సరిపెట్టాడు.