శాంతి స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధం: ప్రధాని మోడీ

శాంతి స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధం: ప్రధాని మోడీ

మాస్కో: శాంతిని నెలకొల్పడానికి, ఇతరులకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన మోడీ.. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‎తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. వివాదాలకు శాంతియుత పరిష్కారాలను భారత్ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‎తో యుద్ధానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని పుతిన్‎కు సూచించారు. 

ALSO READ | మహిళలపై నేరాలు చేయాలంటే భయం పుట్టాలి: జాతీయ మహిళ కమిషన్ చైర్మన్

‘‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మేము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది భారత్ వైఖరి. వివాదాలకు శాంతియుత పరిష్కారాలు ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. శాంతిని నెలకొల్పడానికి సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. గత మూడు నెలల్లో రష్యాలో తాను చేసిన పర్యటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచాయని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం కజాన్ వంటి అందమైన నగరాన్ని సందర్శించే అవకాశం నాకు లభించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కజాన్‌లో భారత కొత్త కాన్సులేట్ ప్రారంభిస్తామని తెలిపారు.