
- ప్రపంచ వాణిజ్యంలో కీలకంగా మారుతున్న ఇండియా
- వచ్చే ఐదేళ్లలో పెరిగే వ్యాపారంలో 6 శాతానికి చేరుకోనున్న మన దేశ వాటా
- యూఎస్, చైనా తర్వాత మూడో ప్లేస్లో నిలిచే అవకాశం
- ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో పెరుగుతున్న ఎగుమతులు: డీహెచ్ఎల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రేడ్లో ఇండియా ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇంకో ఐదేళ్లలో ప్రపంచ వ్యాపారంలో కీలకంగా మారుతుందని డీహెచ్ఎల్ ట్రేడ్ అట్లాస్ ఓ రిపోర్ట్లో అంచనా వేసింది. ఈ టైమ్లో పెరిగే వాణిజ్యంలో ఇండియా వాటా 6 శాతానికి చేరుకుంటుందని, 12 శాతంతో చైనా మొదటి ప్లేస్లో, 10 శాతంతో యూఎస్ రెండో ప్లేస్లో నిలుస్తాయని వెల్లడించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాతో పాటు వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా గ్లోబల్ ట్రేడ్లో కీలకంగా మారనున్నాయి. వీటి ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా. ఇతర దేశాలతో ఇండియా వ్యాపారం గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. కిందటేడాది 13వ అతిపెద్ద వాణిజ్య దేశంగా నిలిచింది. ఇండియా వాణిజ్యం 2019–24 మధ్య ఏడాదికి 5.2 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఇదే టైమ్లో గ్లోబల్ వాణిజ్యం కేవలం ఏడాదికి 2 శాతం చొప్పునే పెరిగింది.
వేగం పెంచిన వాణిజ్యం..
ఇండియా ఎగుమతులు పెరుగుతుండడానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడమేనని డీహెచ్ఎల్ రిపోర్ట్ పేర్కొంది. దీనికి తోడు కొత్త దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్టీఏ)ను కుదుర్చుకోవడంతో కొత్త మార్కెట్లలలోకి ఇండియా ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు యూఎస్, చైనాతో సన్నిహితంగా లేని దేశాలు ఇండియాతో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈ రిపోర్ట్ ప్రకారం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా, వియత్నాం, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలు ప్రపంచ వాణిజ్యంలో తమ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. గ్లోబల్ ట్రేడ్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. మరోవైపు గ్లోబల్ ట్రేడ్లో అటు యూఎస్, ఇటు చైనాతో క్లోజ్గా లేని తటస్థ దేశాల వాటా పెరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 2016లో ఈ దేశాల వాటా 15.4 శాతం ఉంటే 2024 నాటికి ఇది 17.5 శాతానికి పెరిగింది. ఇందులో ఇండియా వాటా పెరుగుతోంది.