
స్త్రీ, పురుష సమానత్వం విషయంలో భారత్ అట్టడుగున 135వ స్థానంలో నిలిచింది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలకు సంబంధించి గతంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకినా ప్రపంచంలో ఇంకా చివరి స్థానాల్లోనే భారత్ ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరానికి(డబ్ల్యూఈఎఫ్) చెందిన జండర్ గ్యాప్ రిపోర్ట్–2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్ తర్వాతి స్థానాల్లో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చద్లు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. స్త్రీ, పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశంగా ఐస్లాండ్ తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూ ప్రపంచంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆర్థిక రంగంలో భాగస్వామ్యం, అవకాశాల విషయంలో చాలా సానుకూల మార్పులు ఉన్నాయని స్త్రీ, పురుష కార్మికుల భాగస్వామ్యం మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది. మహిళా ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల శాతం 14.6శాతం నుంచి 17.6శాతానికి పెరిగిందని, మహిళా సాంకేతిక పని వారి శాతం 29.2 నుంచి 32.9 శాతానికి పెరిగిందని వివరించింది. రాజకీయ సాధికరత విషయంలో భారత్ 48వ స్థానంలో ఉంది. హెల్త్, సర్వైవల్ సూచీలో భారత్ చివరి స్థానం(146)లో ఉండటం గమనార్హం.