
- ఆతిథ్య హక్కుల కోసం ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్కు మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ఇండియా సిద్ధం అవుతోంది. 2036 ఒలింపిక్స్ను మన దేశంలో నిర్వహించాలని చూస్తున్న ప్రభుత్వం అంతకంటే ముందుగా 2030 ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ లేఖ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) ఇస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. వచ్చే ఏడాది గ్లాస్గో వేదికగా జరిగే తర్వాతి ఎడిషన్లో తొలగించిన క్రీడలను కూడా మన దేశంలో నిర్వహించాలని భావిస్తోంది. ఇండియా చివరగా 2010లో కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చింది.
2030 సీడబ్ల్యూజీ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ఇచ్చేందుకు తుది గడువు మార్చి 31వ తేదీ వరకు ఉండగా.. ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తామని క్రీడా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్తో ప్రాధమిక చర్చలు కూడా జరిపినట్టు తెలిపాయి.