
- నేడు లంకతో ఇండియా మూడో టీ20
- రా. 7 నుంచి సోనీ స్పోర్ట్స్లో లైవ్
పల్లెకెలె: తొలి రెండు మ్యాచ్ల్లో శ్రీలంకను హడలెత్తించిన టీమిండియా.. మూడో టీ20పై దృష్టి పెట్టింది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్కు తుది జట్టులో మార్పులు చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు ఆడటంతో పేసర్లపై ఎక్కువ భారం పడనుంది. దీంతో రిజర్వ్లో ఉన్న ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు చాన్స్ ఇస్తారేమో చూడాలి. మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కూ అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు సిరీస్ కోల్పోయిన లంకేయులు కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రెండో మ్యాచ్లో ఆడిన జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. వరుసగా ఫెయిలైన దాసున్ షనక ప్లేస్లో అవిష్కా ఫెర్నాండో, దినేశ్ చండిమల్లో ఒకరికి చాన్స్ దక్కొచ్చు.
రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్ షురూ..
వన్డే సిరీస్ కోసం శ్రీలంకకు చేరుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా సోమవారం ప్రాక్టీస్ షురూ చేశారు. ఆదివారం వీళ్లు కొలంబో చేరుకున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ, కుల్దీప్ దాదాపు నెల రోజుల నుంచి ఆటకు దూరంగా ఉంటున్నారు. దీంతో వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ను సరి చూసుకునేందుకు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. శ్రేయస్ అయ్యర్ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఆగస్టు 2, 4, 7న కొలంబోలో లంకతో వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి.
ఇండియాలో 2025 ఆసియా కప్
కౌలాలంపూర్: వచ్చే ఏడాది టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. 2027 వన్డే ఫార్మాట్ ఆసియా కప్ బంగ్లాదేశ్లో జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం ప్రకటించింది. అఫ్గానిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాగేశ్తో పాటు క్వాలిఫయింగ్ ఈవెంట్ ద్వారా ఓ నాన్ టెస్టు ప్లేయింగ్ టీమ్ ఈ టోర్నీలో పాల్గొంటుందని తెలిపింది.