
దంతెవాడ: మావోయిస్టులు ఆయుధాలను విడిచి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమవుతుందని వ్యాఖ్యానించారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం శనివారం బస్తర్లో నిర్వహించిన ‘బస్తర్ పండుమ్’ ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్తర్ ఏరియాలో ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకోవాలని మావోయిస్టులు చూస్తున్నారని, అది వాళ్లకు సాధ్యం కాదని అన్నారు.
‘‘బస్తర్ అడవుల్లో తూటాలు, బాంబు పేలుళ్ల టైమ్ ముగిసింది. 50 ఏండ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మోదీ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. నక్సలైట్లు ఆయుధాలను వదిలి లొంగిపోవాలి. అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణగా ఉంటాయి” అని తెలిపారు.
నక్సలైట్లు లేని బస్తర్ను స్థానికులు కోరుకున్నప్పుడే డెవలప్మెంట్ సాధ్యమని, ఐదేండ్లలో ఈ ఏరియాను అభివృద్ధి చేయాలని తమ డబుల్ ఇంజన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నక్సల్ విముక్త గ్రామాలకు రూ. కోటి చొప్పున నిధులు అందిస్తామన్నారు. గ్రామాల్లో మీటింగ్లు పెట్టుకొని, నక్సలైట్లు లొంగిపోయేలా తీర్మానాలు చేయాలని బస్తర్ వాసులకు అమిత్ షా సూచించారు.