
- రాణించిన రావల్, హర్మన్ప్రీత్, జెమీమా
కొలంబో: మూడు దేశాల వన్డే సిరీస్లో ఇండియా విమెన్స్ టీమ్ వరుసగా రెండో విజయం అందుకుంది. స్పిన్నర్ స్నేహ్ రాణా (5/43) ఒకే ఓవర్లో మూడు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో.. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో ఇండియా 15 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. దీంతో నాలుగు పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. తొలుత టాస్ నెగ్గిన ఇండియా 50 ఓవర్లలో 276/6 స్కోరు చేసింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (91 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 78) ఫామ్ కొనసాగించగా, స్మృతి మంధాన (36) అండగా నిలిచింది.
హర్లీన్ డియోల్ (29) కూడా మెరుగ్గా ఆడింది. ప్రతీకాతో రెండో వికెట్కు 68 రన్స్ జత చేసింది. కానీ మూడు రన్స్ తేడాలో రావల్, డియోల్ వెనుదిరగడంతో స్కోరు 154/3గా మారింది. ఈ దశలో హర్మన్ప్రీత్ కౌర్ (41 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (41), చివర్లో రిచా ఘోష్ (24) మెరుపులతో ఇండియా భారీ టార్గెట్ను నిర్దేశించింది. మలాబా రెండు వికెట్లు తీసింది.
బ్రిట్స్ సెంచరీ వృథా
భారీ ఛేజింగ్లో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 261 రన్స్కు ఆలౌటైంది. ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (109) సెంచరీతో చెలరేగినా ఇండియా స్పిన్నర్లు కీలక టైమ్లో వికెట్లు తీసి విజయాన్ని అడ్డుకున్నారు. బ్రిట్స్, లారా వోల్వర్త్ (43) తొలి వికెట్కు 142 రన్స్ జోడించి బలమైన ఆరంభాన్నిచ్చారు. కానీ 28వ ఓవర్లో దీప్తి (1/40) ఈ జోడీని విడదీసి కీలక మలుపు తిప్పింది. ఆపై బ్రిట్స్ రిటైర్డ్ హర్ట్ కావడం సఫారీలను దెబ్బతీసింది. మిడిల్లో లారా గుడాల్ (9), కరాబో మెసో (7) ఫెయిలైనా, సున్ లూస్ (28), క్లోయ్ ట్రయాన్ (18) కాస్త పోరాడటంతో సఫారీలు 240/5 స్కోరుతో నిలిచారు. కానీ 48వ ఓవర్లో స్నేహ్ రాణా ఐదు బాల్స్ తేడాలో డెరెక్సన్ (30), డిక్లెర్క్ (0), బ్రిట్స్ను పెవిలియన్కు పంపి ఇండియాను గెలిపించింది. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఇండియా.. శ్రీలంకతో తలపడుతుంది.