Women's Asia Cup 2024: ఆసియా కప్ ఫైనల్లో భారత్... సెమీస్‌లో బంగ్లాదేశ్ చిత్తు

Women's Asia Cup 2024: ఆసియా కప్ ఫైనల్లో భారత్... సెమీస్‌లో బంగ్లాదేశ్ చిత్తు

మహిళల ఆసియా కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం (జూలై 26) బంగ్లాదేశ్ పై జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ వికెట్ కోల్పోకుండా 11 ఓవర్లలో 83 పరుగులు చేసి గెలిచింది. రాత్రి జరిగే మరో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు భారత్ తో ఫైనల్ ఆడుతుంది.     

81 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షెఫాలీ కాస్త నెమ్మదిగా ఆడినా.. మందాన మాత్రం బౌండరీలతో హోరెత్తించింది. ఈ టోర్నీలో అద్భుత ఫామ్ లో ఉన్న వీరిద్దరూ మరోసారి భారత్ కు గొప్ప ఆరంభంతో విజయాన్ని అందించారు. 39 బంతుల్లో స్మృతి మందాన 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో 56 పరుగులు చేయగా.. షెఫాలీ 28 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసింది.     

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 80 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలోనే రేణుక సింగ్  చెలరేగడంతో బంగ్లాదేశ్ 33 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. ఆ తర్వాత రాధా యాదవ్ విజృంభించడంతో బంగ్లా 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ నిగార్ సుల్తాన్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. శ్రోన అక్తర్ 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత బౌలర్లలో రేణుక సింగ్, రాధ యాదవ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ, పూజ వస్త్రాకార్ కు చెరో వికెట్ లభించింది.