IND vs BAN 2024: ఉప్పల్ టీ20లో టీమిండియా భారీ విజయం.. 3-0 తో సిరీస్ కైవసం

IND vs BAN 2024: ఉప్పల్ టీ20లో టీమిండియా భారీ విజయం.. 3-0 తో సిరీస్ కైవసం

బంగ్లాదేశ్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన చివరిదైన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల రికార్డ్ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 7 వికెట్లను 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ 3-0 తో సిరీస్ గెలుచుకుంది.

మెరుపు సెంచరీతో సత్తా చాటిన సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకముందు  రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0 తేడాతో గెలుచుకోవడంతో ఈ టూర్ లో బంగ్లా విజయం లేకుండానే ముగించింది. 298 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలోనే 59 పరుగులు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా నితీష్ కుమార్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్లో లిటన్ దాస్ (42) చెలరేగి 5 బౌండరీలు బాదాడు. 

ఆరో ఓవర్ లో బిష్ణోయ్ వికెట్ మెయిడీన్ తో బంగ్లా జోరుకు కళ్లెం వేశాడు. ఇక్కడ నుంచి బంగ్లా స్కోర్ వేగం నెమ్మదించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హృదయ్(63*) మరో ఎండ్ లో పోరాడాడు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. భారత బౌలర్లలో బిష్ణోయ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మయాంక్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి.   బిష్ణోయ్, నితీష్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.      

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (47 బంతుల్లో 111: 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీకి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(35 బంతుల్లో 75: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైనా చివర్లో హార్దిక్ పాండ్య (47), రియాన్ పరాగ్ (34) బ్యాట్ ఝళిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ కు మూడు వికెట్లు దక్కాయి. ముస్తాఫిజుర్ రెహమాన్,తస్కిన్ అహ్మద్,మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు.