
- వరుసగా 11వ ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ప్రధాని
- రెండో స్థానంలో అమిత్ షా, మూడో స్థానంలో జైశంకర్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 ఏడాదికిగాను మన దేశంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ ఏడాది మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ప్లేస్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మూడోస్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, 4వ స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, 5వ ప్లేస్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 6వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 7వ స్థానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, 8వ స్థానంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికైన నేపథ్యంలో 16 వ ర్యాంకు నుంచి 9వ స్థానానికి ఎగబాకారు. అలాగే.. వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ 10, గౌతమ్ అదానీ 11వ స్థానంలో ఉన్నారు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్, అరవింద్ శ్రీనివాస్ వంటి వ్యాపార దిగ్గజాలు కూడా వరుసగా 47, 70 స్థానాల్లో నిలిచారు. గతంలో18వ స్థానంలో ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పుడు 52వ స్థానానికి పడిపోయారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరుటి జాబితాలో 15వ ప్లేస్ లో ఉండగా, ఈసారి మూడు స్థానాలు దిగజారి18వ ర్యాంక్ పొందారు.
చంద్రబాబుకు 14, రేవంత్ రెడ్డికి 28వ స్థానం..
జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు14వ స్థానం, కర్నాటక సీఎం సిద్ధరామయ్య 20 (నిరుడు 22వ ర్యాంక్), తమిళనాడు సీఎం స్టాలిన్ 23 (నిరుడు 25), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28(నిరుడు 39), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే 33 (నిరుడు 36)వ ప్లేస్ లలో నిలిచారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 73, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ 89, నటుడు అల్లు అర్జున్ 92వ స్థానాల్లో ఉన్నారు. అయితే, గతేడాది 39వ స్థానంలో ఉన్న సీఎం రేవంత్ ఈఏడాది ఏకంగా 11స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్(97), దిల్జిత్ దోసాంజ్(98), అమితాబ్ బచ్చన్(99), అలియా భట్(100) కూడా చోటు పొందారు.