
లక్నో: చెరో ఐదు విజయాలతో 10 పాయింట్లతో ముందుకు సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్జెయింట్స్ కీలక పోరుకు రెడీ అయ్యాయి. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్లో గెలిచి పాయింట్లతో పాటు రన్రేట్ను మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇప్పటి వరకు జట్టు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఇద్దరు కెప్టెన్లు మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నారు. ఇది రెండు ఫ్రాంచైజీల మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. లీగ్లో అత్యంత ఖరీదైన రిషబ్ పంత్ ఫామ్ లక్నోకు పెద్ద సమస్యగా మారింది.
ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం 106 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క మ్యాచ్లో 63 రన్స్ కొట్టాడు. ఇక డీసీకి కూడా అక్షర్ పటేల్ ఫామ్ సమస్యగా మారింది. కెప్టెన్సీ బాగున్నా ఆల్రౌండర్గా జట్టుకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. ఇక డీసీ జట్టు బ్యాటింగ్లో పెద్దగా ఇబ్బందుల్లేవు. గత మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడినా అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ అవకాశం లభిస్తే బ్యాట్లు ఝుళిపించేందుకు రెడీగా ఉన్నారు. డుప్లెసిస్ గాయం నుంచి కోలుకోకపోవడం మైనస్గా మారింది.
బౌలింగ్లో స్టార్క్కు తోడుగా ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ చెలరేగాలి. స్పిన్నర్లు విప్రజ్ నిగమ్, కుల్దీప్ సత్తా మేరకు రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ఇక రాజస్తాన్తో జరిగిన చివరి మ్యాచ్లో రెండు రన్స్తో గట్టెక్కిన లక్నో కూడా మంచి ఫామ్లో ఉంది. మార్ష్, మార్క్రమ్, పూరన్, ఆయుష్ బదోనీ, మిల్లర్, అబ్దుల్ సమద్ భారీ స్కోరు చేయగల సమర్థులు. అవకాశం దొరికితే ఒంటిచేత్తో మ్యాచ్ను మార్చేయగల దిట్టలు. బౌలింగ్లో ఆవేశ్ ఖాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రాఠీ రన్స్ కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ కీలకం కానున్నారు. పార్ట్ టైమర్గా మార్క్రమ్ కూడా వికెట్లు తీస్తుండటం లాభించే అంశం.