
హనుమకొండ/వరంగల్, వెలుగు : వరంగల్కు ముప్పై ఏళ్ల తర్వాత భారత ప్రధాని, మొట్టమొదటి సారిగా మోదీ రావడం పట్ల నగర ప్రజలు, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఉదయం 10.10కి మామునూరు ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన మోదీ మధ్యాహ్నం 1.05 గంటల వరకు మొత్తం 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే శనివారం ఉదయమే మీటింగ్ ఉండడం శుక్రవారం రాత్రి వర్షం పడి సభా ప్రాంగణం చిత్తడిగా మారడంతో బీజేపీ లీడర్లలో కాస్త టెన్షన్ కనిపించింది. కానీ ప్రధాని టూర్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగడంతో బీజేపీ క్యాడర్లో జోష్ నింపింది.
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా మొట్టమొదట వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి ఆలయాన్ని భారత ప్రధాని సందర్శించడం ఇదే ఫస్ట్టైం. ప్రధాని మోదీ మామునూరు నుంచి డైరెక్ట్గా భద్రకాళి అమ్మవారిని ఆలయానికి వెళ్లారు. అక్కడ అర్చకులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం చేశారు. తర్వాత మోదీ ఆలయంలోనే కొద్దిసేపు ధ్యానం చేశారు. అనంతరం ఎండోమెంట్ ఆఫీసర్లు అమ్మవారి ఫొటోను అందజేశారు.
3 ప్రాజెక్ట్లకు వర్చువల్గా శంకుస్థాపన
భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాని మోదీ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం భారత్ మాల పరియోజనలో భాగంగా ఎన్హెచ్ 563 కరీంనగర్ నుంచి వరంగల్ వరకు రూ.2,147 కోట్లతో నిర్మించనున్న 68 కిలోమీటర్ల ఫోర్లైన్ రోడ్డుకు, నాగపూర్-– విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మంచిర్యాల – -వరంగల్ మధ్య రూ.3,441 కోట్లతో 108 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేకు, కాజీపేటలో రూ.521 కోట్లతో నిర్మించనున్న రైల్వే వ్యాగన్ యూనిట్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మోదీతో పాటు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడారు. సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏనుగుల రాకేశ్రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పాల్గొన్నారు.
మోదీకి ఘన స్వాగతం
ఫస్ట్ టైం వరంగల్కు వచ్చిన ప్రధాని మోదీకి బీజేపీ లీడర్లు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. మోదీ కాన్వాయ్ భద్రకాళి ఆలయం నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కు వెళ్తున్న టైంలో రోడ్డు పొడవునా ప్రజలు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. యువత మోదీ మాస్క్లతో ఆకట్టుకున్నారు. ఉదయమే బహిరంగ సభ పెట్టినా పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. అయితే సభ ప్రారంభానికి ముందు పోలీసులు ఆర్ట్స్కాలేజీ గ్రౌండ్లోకి ఎవరినీ అనుమతించకపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, సహా ఇతర లీడర్లను అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
మోదీ సభకు తరలిన బీజేపీ లీడర్లు
తొర్రూరు/గూడూరు, వెలుగు : వరంగల్లో నిర్వహించిన ప్రధాని మోదీ బహిరంగ సభకు మహబూబాబాద్ జిల్లా గూడూరు, తొర్రూరు మండలాల నుంచి బీజేపీ లీడర్లు తరలివెళ్లారు. తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ జెండా ఊపి వెహికల్స్ను ప్రారంభించారు. వరంగల్ వెళ్లిన వారిలో తొర్రూరు అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శి పరుపాటి రాంమోహన్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, రూరల్ మండల అధ్యక్షుడు బొచ్చు సురేష్, అలిసేరి రవిబాబు, మంగళపళ్లి యాకయ్య, బొమ్మనబోయిన కుమార్ పాల్గొన్నారు.
ప్రధాని పర్యటన సాగిందిలా..
ఉదయం 10.10 గంటలకు ప్రధాని మోదీ మామునూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు.
10.20కి భద్రకాళి ఆలయానికి బయలుదేరారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు.
11.15 గంటలకు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కు చేరుకొని రూ.6,109 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
12 గంటలకు విజయ సంకల్ప సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 1.05 గంటలకు మామునూరు ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హకీంపేటకు బయలుదేరారు.