
న్యూఢిల్లీ: న్యూక్లియర్ ఎనర్జీని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలని ఎన్టీపీసీ ప్లాన్ చేస్తోంది. రానున్న 20 ఏళ్లలో 30 గిగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకునేందుకు 62 బిలియన్ డాలర్లు (రూ.5.40 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు ఇండియాలో పెద్దగా ఆదరణ లేదు. అయినప్పటికీ ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎన్టీపీసీ ప్లాన్ చేస్తోందని, ల్యాండ్ కోసం వెతుకుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
న్యూక్లియర్ పవర్ సెగ్మెంట్లోకి ఫారిన్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లకు ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. దీంతో మొదట 10 గిగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఎన్టీపీసీ ఈ నెంబర్ను మూడు రెట్లు పెంచింది. ‘థర్మల్ పవర్ సెగ్మెంట్లో ఇండియాను ఎలా అయితే లీడ్ చేస్తోందో న్యూక్లియర్ పవర్ సెగ్మెంట్లో కూడా ఎన్టీపీసీ ముందుంటుంది. ఇప్పటికే సరిపోయే ల్యాండ్ను గుర్తించింది. ఫ్యూచర్లో కెపాసిటీ పెంచుకోవడానికి కూడా ఈ సైట్లలో వీలుంటుంది’ అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
కాగా, 2030 నాటికి దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 500 గిగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. 2047 నాటికి 100 గిగావాట్ల కరెంట్ న్యూక్లియర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ 8 గిగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి ఈ నెంబర్ను 20 గిగావాట్లకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
ఎన్టీపీసీ ఇప్పటికే రెండు 2.6గిగావాట్ల కెపాసిటీ ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా మరో ఎనిమిది ప్లేస్లలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం చూస్తోంది. 27 సైట్లను పరిశీలిస్తోంది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో న్యూక్లియర్ ప్లాంట్లను పెట్టే ఆలోచనలో ఉంది.