
- వీసా పాలసీల మార్పులతో విద్యార్థుల్లో ఆందోళన
- అమ్మ ఆరోగ్యం బాగాలేకున్నా చూసేందుకు రావట్లేదు
- హాలీడేస్ లో చెల్లి పెళ్లి ఉన్నా స్వదేశానికి వస్తలేరు
- సోషల్ మీడియాపై నిఘా ఉందని వాడటం బంద్
ఢిల్లీ/హైదరాబాద్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు భయం గుప్పిట బతుకుతున్నారు. ఎఫ్1 వీసాలపై వెళ్లిన వారిపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడం , ఎప్పటికప్పుడు చట్టాల్లో మార్పులు తీసుకువస్తుండటంతో సెలవుల్లో స్వదేశానికి వస్తే అమెరికాలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడంపై ఏదైనా నిషేధం వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.
నిబంధనలు కఠిన తరం చేస్తే తిరిగి రావడం ఆలస్యమవుతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న, ఆ మూవ్ మెంట్ ను సెల్ ఫోన్లలో బంధించిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై ట్రంప్ సర్కారు కొరడా ఝుళిపించింది. దేశాన్ని వీడాలని పేర్కొంటూ మెయిల్స్ పంపింది. ఈ క్రమంలో తాము ఏ మెస్సేజ్ పెట్టినా ప్రభుత్వానికి తెలిసిపోతుందని భావించిన విద్యార్థులు అత్యంత జాగ్రత్త సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియా జోలికే వెళ్లడం లేదు.
ఇమ్మిగ్రేషన్ చట్టాలు మరింత కఠినతరం!
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వీసా మరియు ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ చర్య భారతదేశం నుండి వచ్చిన వారితో సహా అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తోంది. సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్ విద్యార్థిని రియా మెహతా జైపూర్లో తన సోదరి వివాహం కోసం భారతదేశానికి వెళ్లాలనుకుంది. అమెరికాకు తిరిగి రావడంపై నిషేధం వస్తుందనే భయంతోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. పర్డ్యూలో పీహెచ్డీ స్కాలర్ అయిన సమీర్ వ్యాస్, భారతదేశంలో అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడాలని భావించాడు. భవిష్యత్ ఇబ్బందులకు భయపడి ఆ ట్రిప్ ను రద్దు చేసుకున్నాడు. “బ్రౌన్, కార్నెల్, ఎంఐటీ, కొలంబియా, యేల్ తదితర కళాశాలల యాజమాన్యాలు అమెరికా దాటి వెళ్లొద్దంటూ విద్యార్థులు, సిబ్బందిని హెచ్చరించాయి .