
- మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలు
- రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ పెరగనున్న నియామకాలు
- మొత్తం ఇండస్ట్రీ రెవెన్యూ రూ.24 లక్షల కోట్లకు: నాస్కామ్
న్యూఢిల్లీ: ఇండియా టెక్ సెక్టార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.26 లక్షల ఉద్యోగాలను ఇచ్చిందని, దీంతో ఈ సెక్టార్లోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరుకుందని నాస్కామ్ ప్రకటించింది. ఐటీ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) , గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఈ–కామర్స్ కంపెనీలు టెక్ సెక్టార్ కిందకు వస్తున్నాయి.
ప్రస్తుతం ఇండియాలో 1,760 గ్లోబల్ జీసీసీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, 19 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా నియామకాలు జరుగుతాయని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ పేర్కొన్నారు. మరోవైపు ఇండియా టెక్ సెక్టార్ రెవెన్యూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 282.6 బిలియన్ డాలర్ల (రూ.24 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్ల (రూ.26 లక్షల కోట్ల) ను దాటుతుందని అంచనా వేశారు.
నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం, కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ సెక్టార్ రెవెన్యూ 5.1 శాతం పెరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతం వృద్ధి నమోదు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ఔట్ సోర్సింగ్లో ఇండియన్ ఐటీ కంపెనీల వాటా 58 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సర్వీస్ల సెగ్మెంట్ రెవెన్యూ ఏడాది లెక్కన 4.3 శాతం పెరిగి 137.1 బిలియన్ డాలర్ల (రూ.12 లక్షల కోట్ల) కు చేరుకోగా, బీపీఎం ఇండస్ట్రీ రెవెన్యూ 4.7 శాతం పెరిగి 54.6 బిలియన్ డాలర్ల (రూ.4.75 లక్షల కోట్ల) ను టచ్ చేస్తుంది.
ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెగ్మెంట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ సెగ్మెంట్ రెవెన్యూ 7 శాతం పెరిగి 55.6 బిలియన్ డాలర్ల (రూ.4.87 లక్షల కోట్ల) కు చేరుకుంటుంది. టెక్ సెక్టార్కు డొమెస్టిక్ మార్కెట్లో 58.2 బిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుందని, 7 శాతం పెరుగుతుందని నాస్కామ్ ప్రకటించింది.