BGT 2024: ఇది కదా మ్యాచ్ అంటే: రోహిత్ సేనతో రెస్టాఫ్ ఇండియా ఢీ

BGT 2024: ఇది కదా మ్యాచ్ అంటే: రోహిత్ సేనతో రెస్టాఫ్ ఇండియా ఢీ

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధమవుతున్నా అసలు దృష్టి మొత్తం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది. నవంబర్‌లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఫైనల్ కు వెళ్లాలంటే ఈ సిరీస్ చాలా కీలకం. నెల రోజుల సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఇరు జట్లు సన్నాహకాలు ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆ దేశంలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతూ బిజీగా ఉంటే.. భారత క్రికెట్ జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నట్టు సమాచారం. 

నివేదికల ప్రకారం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత క్రికెట్ జట్టు.. ఇండియా ఏ తో సిరీస్ ఆడుతుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఈ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15 నుండి ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుందని సమాచారం. భారత ఏ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేయనున్నాడని టాక్. ఇండియా ఎ జట్టును వారంలో ప్రకటించవచ్చని బీసీసీఐ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పిచ్ లను అర్ధం చేసుకోవడానికి టీమిండియాకు ఇదొక సువర్ణావకాశం గా చెపొచ్చు. 

రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు  ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.