
దేశంలో కరోనా కథ మళ్లీ మొదటికి వచ్చింది. రోజురోజుకూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కేసులు నమోదయ్యాయి. ఇందులో 300 కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించాయి. కేరళలో ముగ్గురు చనిపోగా కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్ లో ఒకరు చనిపోయారు. ఇక తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా ఆ కేసులన్నీ హైదరాబాద్ లోనే వెలుగుచూశాయి. ఇక ఏపీలో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం దేశంలో 2 వేల 669 యాక్టివ్ లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అయితే ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తాజాగా WHO వెల్లడించింది. జేఎన్-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది. ప్రజలు మాత్రం మాస్క్ లు ధరించాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు.