
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా చివరి మ్యాచ్ లో ప్రయోగాలు చేయనుంది. ఆదివారం (మార్చి 2) న్యూజిలాండ్ తో భారత్ గ్రూప్ లో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. వరుసగా రెండు భారీ విజయాలతో చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా తమ చివరి లీగ్ మ్యాచ్లో పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. రోహిత్ శర్మ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.
కివీస్ తో జరగనున్న నామమాత్రపు మ్యాచ్ కు రోహిత్ ను ఆడించే ఆలోచనలో జట్టు యాజమాన్యం లేనట్టు తెలుస్తుంది. రిస్క్ తీసుకోకుండా ఈ మ్యాచ్ లో రోహిత్ కు రెస్ట్ ఇస్తే అతను సెమీ ఫైనల్ సమయానికి తాజాగా ఉంటాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా కాలి కండరాలు పట్టేయడంతో రోహిత్ ఇబ్బందిపడ్డాడు. కొద్దిసేపు ఫీల్డింగ్కు దూరమయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చాడు. అదే జరిగితే రోహిత్ ప్లేస్లో రిషబ్ పంత్ తుది జట్టులోకి రానున్నాడు.
రోహిత్ శర్మ దూరమైతే రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగొచ్చు. ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు సైతం రెస్ట్ ఇవ్వొచ్చు. వీరి స్థానాల్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని అర్షదీప్ సింగ్, వాషింగ్ టన్ సుందర్ లకు ఛాన్స్ దక్కొచ్చు. ఇప్పటికే భారత్ వరుసగా రెండు విజయాలతో సెమీస్ కు చేరుకుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా వరుసగా రెండు విజయాలతో సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో ఆదివారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ నామమాత్రంగా మారనుంది. గెలిచిన జట్టు గ్రూప్ ఏ టేబుల్ టాపర్ గా సెమీస్ లోకి అడుగుపెడుతుంది.