
- నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ
- మలి విడత లబ్ధిదారుల ఎంపికకూ కసరత్తులు షురూ
- జనగామ జిల్లాలో మొత్తం అప్లికేషన్లు 1,43,187
- నెరవేరుతున్న నిరుపేదల సొంతింటి కల
జనగామ, వెలుగు : తెలంగాణ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తుండడంతో పేదోడి సొంతింటి కల నెరవేరుతోంది. ప్రజాపాలనలో భాగంగా జనగామ జిల్లాలో 1.43,187 మంది ఇండ్ల మంజూరు కోసం అప్లై చేసుకున్నారు. తొలి విడతలో ఎంపికైన బేస్మెంట్ లెవల్పనులు పూర్తి చేసిన లబ్ధిదారులకు తొలిదశ రూ.లక్ష నేరుగా వారి ఖాతాల్లో జమయ్యాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పనులు మొదలుపెట్టిన వారికి డబ్బుల జమ..
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ అమలు అటకెక్కింది. ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అర్హులైన వారికి ఇండ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. జనవరి 26న మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
జనగామ జిల్లాలో మొదటి విడతలో 716 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో 354 మంది ఇండ్ల నిర్మాణాలకు పనులు మొదలు పెట్టారు. వీరిలో 97 మంది లబ్ధిదారులకు చెందిన నిర్మాణాలు బేస్మెంట్ లెవల్కు వచ్చాయి. బేస్మెంట్ దశలో చెల్లించాల్సిన రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి.
మిగిలిన గ్రామాల్లో కసరత్తులు..
తొలి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక ప్రక్రియ చేపట్టగా, ఇప్పుడు అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ నెల 22 నుంచి 30 వరకు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి వచ్చే నెల 2న గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెల 5న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా ముందుకు సాగుతున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి దశలను అధికారులు ఫీల్డ్ లెవల్లో పరిశీలించి, అప్లోడ్ చేయనున్నారు. లబ్ధిదారులకు నాలుగు విడతల్లో డబ్బులను జమచేయనున్నారు. బేస్మెంట్ లెవల్ లో రూ.లక్ష, పైకప్పు స్థాయి దాటిన తర్వాత రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష, మొత్తంగా రూ.5 లక్షలు జమ చేయనున్నారు.
- కల నెరవేరుతోంది..
సొంత ఇల్లు లేక గుడిసెలో ఉంటున్న మాకు సర్కారు ఇల్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ప్రజా పాలనలో అప్లికేషన్ పెడితే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇళ్లు ఇచ్చిన్రు. బేస్మెంట్ లెవల్కు నిర్మాణం కాగానే రూ.లక్ష అకౌంట్ల జ-మ చేసిన్రు. - ముడావత్ శిరీష, వాచ్చ తండా, తరిగొప్పుల మండలం
ఆనందంగా ఉంది..
ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకుంటే సర్కారు మంజూరు ఇచ్చింది. మా ఊర్లో మొదట నాకే ఇళ్లు ఇచ్చిండ్రు. బేస్మెంట్ లెవల్ రాగానే లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేసిన్రు. షాన సంతోషంగా ఉంది. ఇప్పుడు గోడల నిర్మాణం మొదలు పెడ్త. సర్కారు సహకారం మరువలేను. - మారోజు రేణుక, బొమ్మకూరు, నర్మెట మండలం
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
సర్కారు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నం. అర్హులందరికీ ఇండ్ల మంజూరు విడతల వారీగా ఉంటుంది. తొలి దశలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో బేస్మెంట్ లెవల్కు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నవారి అకౌంట్లలో రూ.లక్ష జమయ్యాయి. వివిధ దశల్లో మొత్తం రూ.5 లక్షలు చెల్లించనున్నాం.- రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జనగామ