
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. మధ్యప్రదేశ్, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యం ఇవ్వనుంది. ఇరు జట్లు ఇప్పటికే ఇండోర్ చేరుకొని తమ ప్రాక్టీస్ ను మొదలుపెట్టాయి. రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా ఈ టెస్టులో ఎలాగైనా గెలవాలని చూస్తుంటే.. టీమిండియా సిరీస్ పై కన్నేసింది.
పిచ్ రిపోర్టు:
ఇండోర్ లో రసవత్తరంగా సాగబోయే మ్యాచులో ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచులు జరిగాయి. ఆ రెండిట్లో టీమిండియానే గెలిచింది. మూడో టెస్టు కోసం ఎర్ర మట్టి, నల్లమట్టితో కూడిన పిచ్ ను తయారుచేస్తున్నారు. ఈ పిచ్ స్పిన్ కి అనుకూలించడంతో పాటు పేస్ బౌలింగ్, బౌన్సీ ట్రాక్ గా పనిచేస్తుంది. ఇండోర్ లో ఒక సారి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, ఒక సారి మొదట బౌలింగ్ చేసిన జట్లు గెలిచాయి. చేజింగ్ కి అస్సలు పనికి రాదు.
మొదటి ఇన్నింగ్స్ టోటల్ స్కోరు సగటున 353 పరుగులు వస్తాయి. రెండో ఇన్నింగ్స్ 396, మూడో ఇన్నింగ్స్ 214, నాలుగో ఇన్నింగ్స్ 153 పరుగులు వచ్చే అవకాశం ఉంది. పిచ్ కాస్త బ్యాటింగ్ కు కూడా అనుకూలిస్తుండటంతో నాలుగు రోజుపాటైనా ఆట కొనసాగొచ్చు. ఈ పిచ్ పై అత్యధిక వికెట్లు (18) తీసిన రికార్డు అశ్విన్ పేరుమీదే ఉంది.
ముగ్గురు పేసర్లు:
ఇండోర్ పిచ్ పేసర్లకు అనేకూలించడంతో మూడో టెస్టులో టీమిండియా ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశం కనిపిస్తోంది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లను ఆడించొచ్చు. ఇదే జరిగితే అక్షర్ పటేల్ ని బెంచ్ కి పరిమితం చేస్తారు.