
- డెరివేటివ్ పోర్ట్ ఫోలియోలో తప్పిదాలు
- నెట్వర్త్ రూ.2,100 కోట్లు తగ్గే అవకాశం
- ఇన్వెస్టర్లకు రూ.14 వేల కోట్ల లాస్
న్యూఢిల్లీ: డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో లోపాలు ఉన్నట్టు తేలడంతో ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు భారీగా పడ్డాయి. ఈ తప్పిదం వల్ల బ్యాంకుకు రూ.2,100 కోట్ల వరకు నష్టం వస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో భయాలను పెంచాయి. దీంతో షేర్లు మంగళవారం 27 శాతానికిపైగా నష్టపోయి 52 వారాల కనిష్టానికి చేరాయి. ఎన్ఎస్ఈలో స్టాక్ 27.06 శాతం నష్టంతో రూ.656.80వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.27 వేల కోట్లు నష్టపోయారు. తమ డెరివేటివ్ పోర్ట్ఫోలియో ఖాతాల్లో అవతవకలు ఉన్నాయని, గతంలో జరిగిన ఫారెక్స్ ట్రాన్సాక్షన్ల ఖర్చులను బ్యాంకు తప్పుగా అంచనా వేయడం వల్లే ఇలా జరిగిందని సంస్థ తెలిపింది.
ముంబైకి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంటర్నల్ రివ్యూ .. గత డిసెంబర్ నాటికి నెట్వర్త్లో దాదాపు 2.35 శాతం తగ్గవచ్చని వెల్లడించింది. బ్యాంకు షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 42 శాతం తగ్గాయి. షేర్ల పతనం వల్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మంగళవారం ఒక్క రోజే రూ.6,900 కోట్లు నష్టపోయాయి. ఈ విషయమై ఇండస్ఇండ్ వివరణ ఇస్తూ ఆడిటర్ ఈ విషయాన్ని సమీక్షిస్తున్నారని, ఈ నెల చివరి నాటికి రిపోర్ట్ వస్తుందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబరు–అక్టోబరు మధ్య కాలంలో అకౌంటింగ్ లోపాలను గుర్తించామని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈఓ, ఎండీ సమంత్ కత్పాలియా చెప్పారు. దీనిపై ఆర్బీఐకి గత వారమే సమాచారం ఇచ్చామని వెల్లడించారు.
ఆర్బీఐ కూడా ఈ వ్యవహారంపై కన్నేసింది. ప్రస్తుత సీఈఓ పదవీకాలాన్ని మూడేళ్లకు బదులు ఏడాదికి మాత్రమే పొడిగించాలని నిర్ణయింది. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు ఇంటర్నల్ కంట్రల్స్ బలహీనంగా ఉన్నాయని, పాలనాపరమైన సమస్యలూ ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు. దీనిపై బ్యాంక్ చైర్మన్ అశోక్ హిందుజా స్పందిస్తూ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుందని, అవసరమైతే మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అప్రూవల్వచ్చాక బ్యాంకులో వాటాలను పెంచుకుంటామని అన్నారు.