
హైదరాబాద్ రాజ్యంలో పారిశ్రామిక అభివృద్ధి మూడు దశల్లో జరిగింది. మొదటి దశ సాలార్జంగ్–1 ప్రధానిగా ఉన్న 1870లో మొదలై 1918 వరకు కొనసాగింది. రెండో దశ 1919లో మొదలై 1939లో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం, మూడో దశను రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం(1939) నుంచి 1948 వరకు కొనసాగింది. సాలార్జంగ్–1 సంస్కరణల ఫలితంగా ఆధునిక రవాణా, సమాచార రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల ద్వారా తెలంగాణ ప్రాంతంలో నూనె ఉత్పత్తులు, మరాఠ్వాడ ప్రాంతంలో పత్తి ఉత్పత్తులు మొదలయ్యాయి.
1899లో హైదరాబాద్ గోదావరి వ్యాలి రైల్వేలైను మన్మాడును కలుపుతూ ఏర్పాటు చేసిన దానివల్ల ఆ ప్రాంతాలతో పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలను నెలకొల్పడానికి తోడ్పడింది. హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్, వీవింగ్ మిల్స్ లిమిటెడ్ (1877), మహబూబ్శాయి గుల్బర్గా మిల్స్ (1884), ఔరంగాబాద్ మిల్స్ (1888) స్థాపించారు. డోర్నకల్ జంక్షన్ నుంచి సింగరేణి బొగ్గు గనులకు వేసిన రైలుమార్గం ద్వారా బొగ్గు రవాణా సులువైంది. 1901 వరకు అన్ని రకాల పరిశ్రమలు కలిపి 68 వరకు స్థాపించబడ్డాయి.
ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్
బ్రిటిష్ ఇండియాలో పారిశ్రామికీకరణ పూర్తిగా ప్రైవేట్ ఆధ్వర్యంలో జరిగింది. కాని హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగింది. ఇందుకోసం 1929లో ప్రభుత్వం కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ నిధిని కోటి నుంచి మూడు కోట్లకు పెంచారు. చిన్న పరిశ్రమలకు అప్పుగా ఇచ్చి వాటిని ప్రోత్సహించడంతోపాటు అక్కడ నుంచి వచ్చిన లాభాలను చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. అంతకుముందు 1917లో ఇండస్ట్రియల్ లేబరేటరి, 1918లో ప్రత్యేక కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు.
డీబీఆర్ మిల్లు(1920): దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్లు. దీన్నే డీబీఆర్ మిల్స్ అంటారు. ఈ మిల్లును 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో స్థాపించారు. ఇది ప్రైవేట్ కంపెనీ. బయట నుంచి తీసుకువచ్చిన ముడిసరుకులతో బట్టలు తయారు చేసే పరిశ్రమ. ప్రస్తుతం మూత పడింది.
సింగరేణి కాలరీస్(1921): దీనిని ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే గ్రామం పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడే మొదట బొగ్గు గనులు బయటపడ్డాయి. లండన్కు చెందిన హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ సింగరేణి నుంచి బొగ్గు గనులు తవ్వడం ప్రారంభించింది. మొదట్లో దీనిపై పర్యవేక్షణాధికారమంతా ప్రభుత్వాధీనంలోనే ఉండేది. 1920 తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ(ఎస్సీసీ) అనే సంస్థ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ముందుకువచ్చి పరిపాలనా బాధ్యతలు చేపట్టింది.
నిజాం చక్కెర పరిశ్రమ(1937): నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో స్థాపించారు.
ఆల్విన్ మెటల్ వర్క్స్: ఆల్విన్ లిమిటెడ్ను 1942, జనవరిలో ఆల్విన్ మెటల్ వర్క్స్గా నిజాం ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్, మెసర్స్ అల్లావుద్దీన్ అనే కంపెనీ ఉమ్మడి వ్యవస్థతో స్థాపించారు.
ప్రాగాటూల్స్: సికింద్రాబాద్లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే ఉద్దేశంతో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ అనే పేరుతో 1943, మేలో స్థాపించారు. 1963లో ప్రాగాటూల్స్ లిమిటెడ్గా మారుస్తూ డిఫెన్స్ మినిస్ట్రీకి అప్పగించారు.
సర్సిల్క్: సిరిపూర్ కాగజ్నగర్ ప్రాంతంలో సిరిపూర్ పేపర్ మిల్లును ఏర్పాటు చేయడం వల్ల దీన్ని సిరిపూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)గా పిలుస్తారు. ఈ పేపర్ మిల్లు భారతదేశంలో స్థాపించిన మొదటి పరిశ్రమల్లో ఒకటి. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది.
వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ: ఈ పరిశ్రమను 1916లో హైదరాబాద్ విటల్వాడిలో వజీర్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ పరిశ్రమను 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతమున్న వీఎస్టీ అంటే ముషీరాబాద్ – అజామాబాద్కు మార్చారు.
కర్ఖానా జిందా తిలస్మాత్: ఈ కంపెనీ ప్రజలు బాగా ఉపయోగించే జిందాతిలస్మాత్, ఫారూకి పళ్లపొడి, జిందాబామ్ అనే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశ్రమను 1920లో హకీలం మహ్మద్ మొహినుద్దీన్ ఫారూకి హైదరాబాద్లో స్థాపించారు.
ఆజమ్జాహిమీల్స్: ఇది బట్టలు ఉత్పత్తి చేసే పరిశ్రమ. 1934లో వరంగల్లో స్థాపించిన పరిశ్రమల్లో అతి ముఖ్యమైంది.
హైదరాబాద్ స్టేట్ బ్యాంక్: 1941లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకును నెలకొల్పాడు. దీన్నే ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేవారు. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్గా మారింది.
పారిశ్రామిక ప్రదర్శన
19వ శతాబ్ది మధ్యభాగంలో సాలార్ జంగ్ –1 పాలనా కాలంలో మొదట పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన ప్రారంభమైంది. 1930లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించడం ప్రారంభమైంది. చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ముల్కీ ఇండస్ట్రీస్ అనే పత్రికను ప్రారంభించింది. ఆ తర్వాత చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం కాటేజ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్(సీఐఐ)ను ఏర్పాటు చేసింది.