
శిశు మరణాల రేటు అనేది నవజాత శిశువు ఆరోగ్య స్థితిని సూచించే ప్రమాణాల్లో ముఖ్యమైంది. రాష్ట్ర స్థాయిలో శిశు మరణాల రేటు 2011లో 43, 2015–16లో 31.7 ఉండగా 2019–20లో 29.4కు తగ్గింది. హైదరాబాద్ (20), రంగారెడ్డి(34), కరీంనగర్(38), వరంగల్(40)లో రాష్ట్ర సగటు కంటే ఐఎంఆర్ తక్కువగా ఉంది. హైదరాబాద్ మినహా మగ శిశువుల కంటే ఆడ శిశువుల్లో ఐఎంఆర్ తక్కువగా ఉంది. 2011లో రాష్ట్ర స్థాయిలో పురుష, స్త్రీ ఐఎంఆర్ మధ్య వ్యత్యాసం 4 పాయింట్లు. నిజామాబాద్ (10), ఆదిలాబాద్ (8), మెదక్ (8)ల్లో లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. 2004–05, 2011–12 మధ్య ఐఎంఆర్ సంవత్సరానికి 2.86శాతం పాయింట్లు క్షీణించింది. 2019–20 నాటికి ఐఎంఆర్ 27.7 నుంచి 26.4శాతం తగ్గింది.
మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండల్లో క్షీణత రేటును మరింత వేగవంతం చేయడం అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు దేశం(49) కంటే తక్కువగా ఉన్నా తెలంగాణ, కేరళ(12) రాష్ట్రాల మధ్య భారీ అంతరం ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి శిశు మరణాల రేటులో రాష్ట్రం గణనీయమైన తగ్గుదల నమోదు చేసుకుంది. 2014లో 35 ఉండగా, 2019 నాటికి 23కు తగ్గి దేశ సగటుకు 30 కంటే దిగువగా ఉంది.