![అమెరికా నుంచి అమృత్ సర్కు 104 మంది ఇండియన్లు](https://static.v6velugu.com/uploads/2025/02/inidans-reached-amrutsur-from-america_P9FyAvZmCN.jpg)
- భారత్ చేరుకున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల ఫస్ట్ బ్యాచ్ ప్లేన్
న్యూడిల్లీ: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఫస్ట్ బ్యాచ్ విమానం భారత్ చేరింది. టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ ప్లేన్ పంజాబ్ లోని అమృత్సర్లో ఉన్న శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. అందులోని 104 మందిలో పంజాబ్కు చెందినవారు 30 మంది, హర్యానా, గుజరాత్కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు.
ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఇద్దరు చండీగఢ్కు చెందినవారు ఉన్నట్లు అధికార వర్గాలు వివరించాయి. త్వరలో మరింత మంది మైగ్రెంట్స్ ను భారత్ చేర్చే అవకాశం ఉందని తెలిపాయి. అక్రమ వలసదారులతో కూడిన ప్లేన్ భారత్ చేరిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు బయట భారీ బారికేడింగ్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. 104 మందిని తనిఖీలు చేసిన తర్వాత వారిని ఇండ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. వారిలో ఎవరికైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అక్కడే అదుపులోకి తీసుకునేందుకు కూడా చర్యలు చేపట్టారు.
అక్రమ వలసదారులతో కూడిన యుఎస్ సైనిక విమానం భారత్ చేరడంపై పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ స్పందించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడిన వ్యక్తులను ట్రంప్ బహిష్కరించడం కరెక్ట్ కాదన్నారు. వారికి అమెరికాలోనే శాశ్వత నివాసం కల్పించాల్సిందన్నారు. చాలామంది ఇండియన్లు వర్క్ పర్మిట్లపై అమెరికాలోకి ప్రవేశించారని, ఆ పర్మిట్ గడువు ముగిసిపోవడంతో అక్రమ వలసదారులుగా మారారని వివరించారు. ఈ అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కలవాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.