
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చేనేతలను ఆదుకుంటామని, వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీని ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీగా తాను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్లానని, అయినప్పటికీ స్పందన కనిపించ లేదన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరే కారణమని రమణ ఆరోపించారు. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. గత నవంబర్ నుంచే నేతన్నలకు రాష్ట్రంలో పనిలేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని విమర్శించారు.