వేములవాడ, వెలుగు : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మారు విస్మరించిందని బడ్జెట్ కేటాయింపుల్లో మరోసారి తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను అసంతృప్తికి గురిచేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ, పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్ లు ప్రధానులుగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయన్నారు.
పేదలు, యువత, రైతులు, మహిళలను అభివృద్ధి ఇంజన్లుగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన నాలుగు వర్గాలకు నిరాశే మిగిల్చిందన్నారు. . తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా సాధించింది సున్నా అన్నారు. ఢిల్లీ, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బడ్జెట్ తయారు చేసినట్లు ఉందని అన్నారు. విభజన హామీలు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి చెప్పలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బడ్జెట్లో నిర్లక్ష్యం చేశారని, తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం నిరూపించింది అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ లో చేరికలు
వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మైలారం రాముతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ లో చేరారు. రాము, చింతల తాడెం దేవయ్య, చింతలతాడేం శ్రీను, మల్లేశం, మర్రిపల్లి మైసయ్య , పోతారం రమేష్, రాజులతో పాటు మరికొంత మందికి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులున్నారు.