మతిస్థిమితం లేని మహిళ కిడ్నాప్, రేప్​

మతిస్థిమితం లేని మహిళ కిడ్నాప్, రేప్​

ఇద్దరు నిందితులు అరెస్ట్

మియాపూర్, వెలుగు: మియాపూర్​లో బస్టాప్ వద్ద నిల్చున్న మతిస్థిమితం లేని మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఏసీపీ శ్రీనివాస్​రావు తెలియజేశారు. కూకట్​పల్లికి చెందిన ఓ మహిళ(35)కు మతిస్థిమితం  లేకపోవడంతో మియాపూర్ క్రాస్​రోడ్డు బస్టాప్​వద్ద ఉంటోంది. 

21న అర్ధరాత్రి అక్కడే ఉన్న ఆమెను ఇద్దరు స్కూటీపై వచ్చి బలవంతంగా బాచుపల్లి వైపు తీసుకువెళ్లారు. దీన్ని చూసిన ఓ క్యాబ్​ డ్రైవర్ 100కు సమాచారం ఇచ్చాడు.  దీంతో పోలీసులు మూడు గంటల్లోనే మహిళను ఐడీఏ బొల్లారం వద్ద గుర్తించారు. వైద్య పరీక్షల కోసం దవాఖానకు తరలించారు. 

డాక్టర్లు ఆమెపై  లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించడంతో కిడ్నాప్​ అండ్​ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 23న బాలకుమార్(25), మహేశ్​(24)ను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళను మియాపూర్​బస్టాప్​ నుంచి అలియాపురం తండా సమీపంలోకి తీసుకువెళ్లి లైంగికదాడి చేసి వదిలేసినట్లు విచారణలో అంగీకరించారు. 

దీంతో ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.  చందానగర్​లోని శాంతినగర్​కు చెందిన బాలకుమార్​ ఆటో నడుపుతూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై ఇప్పటికే స్నాచింగ్, రాబరీ, ఇండ్లలో దొంగతనాల వంటి 8 కేసులున్నాయి.  మెదక్​ జిల్లా గుడిపెద్దాపూర్​ కు చెందిన మహేశ్​ పెయింటర్. ఇతనిపై మర్డర్​ కేసు, దొంగతనం కేసు ఉందని ఏసీపీ తెలిపారు.