అలహాబాద్ హైకోర్టు తీర్పుపై షాకైన సుప్రీం.. ‘అమానవీయం’ అని వ్యాఖ్య

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై షాకైన సుప్రీం.. ‘అమానవీయం’ అని వ్యాఖ్య

న్యూఢిల్లీ: బాలిక ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం అత్యాచారయత్నం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది. అలహాబాద్ జడ్జి తీర్పు షాకింగ్గా అనిపించిందని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్ బెంచ్ వ్యాఖ్యానించింది.

అలహాబాద్ హైకోర్టు వెల్లడించిన ఈ తీర్పు అమానవీయమని, ఒక సున్నితమైన అంశంలో బాధితురాలిపై కనీస సానుభూతి చూపకపోవడమేనని సుప్రీం కోర్టు వ్యా్ఖ్యానించింది. అలహాబాద్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీని పరిశీలించామని.. ఆ తీర్పు కాపీలో 21, 24, 26 పేరాల్లో సున్నితత్వం పూర్తిగా లోపించిందని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. ఆ న్యాయమూర్తి వివాదాస్పద తీర్పుపై, వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

అసలు ఏం జరిగిందంటే..
2021లో ఉత్తరప్రదేశ్ ​రాష్ట్రం కాస్​గంజ్ లో తల్లి, తన 11 ఏండ్ల బాలికతో మరో గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే బైక్​పై అటుగా వెళ్తున్న ఆకాశ్, పవన్ అనే వ్యక్తులు అమ్మాయిని తాము దిగబెడుతామని చెప్పి ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లాక ఒక కల్వర్టు వద్ద బైక్​ ఆపి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అసభ్యంగా పట్టుకోవడం, బాలిక డ్రెస్​ లాగడం, తన పైజామా నాడాని తెంపేడయం వంటివి చేశారు. 

కల్వర్టులోకి లాక్కెళ్తుండగా బాలిక వేసిన కేకలు విని సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు వచ్చి బాధితురాలిని కాపాడారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన కేసు తుది విచారణను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తుది తీర్పు వెల్లడించారు.

మహిళల ఛాతీపై చేయి వేయడం, పైజామా డ్రెస్ లాగడం వంటి వాటిని రేప్ అటెంప్ట్ లేదా రేప్ గా పరిగణించరాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ ప్రయత్నాన్ని లైంగిక దాడి చర్యగా పరిగణించవచ్చని అందులో పేర్కొంది. రేప్ ఆరోపణల్లో అత్యాచార ప్రయత్నానికి సిద్ధమయ్యే దశ(ప్రిపరేషన్ స్టేజ్), వాస్తవంగా రేప్ చేసే ప్రయత్నం (యాక్చువల్​స్టేజ్) మధ్య తేడా ఉంటుందని తెలిపింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

‘‘నిందితులు పవన్, ఆకాశ్​పై వచ్చిన ఆరోపణలు, కేసుకు సంబంధించిన వాస్తవాలు పరిశీలిస్తే వారి చర్యలను రేప్ అటెంప్ట్గా పరిగణించరాదు. రేప్, రేప్ అటెంప్ట్ ఆరోపణలు నిరూపించాలంటే వారి చర్యలు ప్రిపరేషన్ స్టేజ్ను దాటిపోయినట్టుగా నిర్ధారించాలి. ఒక నేరానికి పాల్పడటానికి సిద్ధమవడం, వాస్తవ ప్రయత్నం మధ్య తేడా గుర్తించాలి” అని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులిద్దరు రేప్​ చేయాలనుకున్నారని నిర్ధారించడానికి రికార్డుల్లో ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ALSO READ : హద్దు మీరితే అనుభవించాల్సిందే.. కమెడియన్ కమ్రా వ్యాఖ్యలపై ఏక్​నాథ్​ షిండే స్పందన

అయితే నిందితులు బాలిక దుస్తులు తొలగించేందుకు యత్నించినందున వారిపై ఐపీసీ సెక్షన్ 354 (బి) పోక్సో చట్టం కింద విచారించాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ తీర్పుపై ‘ఎక్స్’లో పోస్ట్​చేశారు. అలహాబాద్​హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటో యాక్షన్ అవసరమన్నారు. సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి అలహాబాద్ హైకోర్టు తీర్పు అమానవీయం అని పేర్కొంది.