
ఆదిలాబాద్టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతా పరమైన అంశాలను నిశితంగా పరిశీలించి అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.