డెంగ్యూతో ఇంటర్ స్టూడెంట్ మృతి

డెంగ్యూతో ఇంటర్ స్టూడెంట్ మృతి

కామారెడ్డి, వెలుగు: డెంగ్యూతో స్టూడెంట్​చనిపోయిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. టెకిర్యాల్​కు చెందిన చౌకి సుజిత్ (16) స్థానికంగా ఇంటర్​ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి10 రోజుల కిందట జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో అడ్మిట్ చేశారు. టెస్ట్ లు చేయగా డెంగ్యూగా నిర్ధారణ అయింది. ఎంతకూ జర్వం తగ్గకపోగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్​లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ సుజిత్ ఆదివారం చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జ్వరాల బారిన పడి ఇప్పటికే జిల్లాలో ఐదుగురు చనిపోయారు.

పెద్దపల్లి జిల్లాలో మహిళ.. 

ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన మామిడి శ్రీలత(40) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెను భర్త శ్రీనివాస్‌ ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా.. తగ్గడంలేదు. అక్కడి నుంచి కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా అక్కడ కూడా నయం కాలేదు.  వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ కు తీసుకెళ్లగా.. డాక్టర్లు పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారించారు. ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.