
కరీంనగర్ జిల్లాలో ఘటన
చొప్పదండి, వెలుగు : ఇంటర్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో గురువారం జరిగింది. ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పుసాల రోహిత్ (17) కరీంనగర్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్న రోహిత్ ఫెయిల్ అవుతానేమోనని బాధపడుతూ ఉండేవాడు. బుధవారం అర్ధరాత్రి వరకు రోహిత్ చదువుకుంటూనే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడి పెద్దమ్మ అరుణ నిద్ర లేచి చూసేసరికి ఇంటి ముందున్న వరండాలో చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి రోహిత్ను కిందికి దించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.